భారత్‌ హ్యాట్రిక్‌

  • థాయిలాండ్పై 13-0గోల్స్‌తో భారీ విజయం
  • ఆసియాకప్‌ మహిళల హాకీ

పాట్నా: ఆసియాకప్‌ మహిళల హాకీలో ఇండియా హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. రాజ్‌గిరి హాకీ స్టేడియంలో గురువారం జరిగిన గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 13-0 గోల్స్‌తో థాయిలాండ్ను చిత్తుచేసింది. మ్యాచ్‌ ప్రారంభమైన మూడో నిమిషంలో భారత్‌ ఒక గోల్‌ కొట్టింది. ఈ గోల్‌ను దీపిక చేసింది. థాయిలాండ్ నలుగురు డిఫెండర్లను దాటి దీపిక గోల్‌ చేసింది. ఆ తర్వాత మనీషా చౌహాన్‌ తొలి అంతర్జాతీయ గోల్‌ను నమోదు చేసుకుంది. ఈ గోల్‌ పెనాల్గీ కార్నర్‌ద్వారా భారత్‌కు దక్కింది. ప్రీతి దూబే, లాల్‌రెమ్‌సియామి ఒక్కో గోల్‌ కొట్టారు. దీంతో భారత్‌ తొలి అర్ధభాగం ముగిసేసరికి 4-0గోల్స్‌ ఆధిక్యతలో నిలిచింది. మ్యాచ్‌ మొత్తమ్మీద భారత్‌కు 11 పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. ఇక మూడో క్వార్టర్‌ చివరి మూడు నిమిషాల్లో భారత్‌ మరో నాలుగు గోల్స్‌ చేసింది. దీపిక ఐదు, ప్రీతీ దూబే, లాల్‌రిమిసిమి, బ్యూటీ డెంగ్‌, మనీషా రెండేసి గోల్స్‌ కొట్టారు. చైనాను దాటి భారత్‌ అగ్రస్థానంలో నిలవాలంటే 17గోల్స్‌ చేయాల్సి ఉండగా.. భారత్‌ 13గోల్స్‌కే పరిమితమైంది. దీంతో చైనా 4గోల్స్‌ ఆధిక్యతతో టాప్‌లో ఉండగా.. భారత్‌ రెండోస్థానంలో కొనసాగుతోంది. భారత్‌, చైనా జట్లు వరుసగా మూడు విజయాలతో సహా 9 పాయింట్లతో అగ్రస్థానంలోనే ఉన్నాయి. ఈ గెలుపుతో భారత్‌ సెమీస్‌కు మరింత చేరువైంది. తొలి మ్యాచ్‌లో కొరియాపై 3-2గోల్స్‌తో, ఆ తర్వాత మలేషియాపై 4-0తో గెలిచిన భారత్‌.. మూడో మ్యాచ్‌లో థాయిలాండ్పై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు మలేషియా జట్టు 2-1గోల్స్‌ తేడాతో కొరియాను చిత్తుచేసింది. దీంతో మలేషియా ఈ టోర్నమెంట్‌లో అత్యధిక ర్యాంక్‌ గల జట్టుపై విజయం సాధించింది. మరో మ్యాచ్‌లో చైనా 2-1గోల్స్‌ తేడాతో జపాన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది.

➡️