- టాప్-10లో హర్మన్ప్రీత్కు చోటు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. భారత, న్యూజిలాండ్ క్రికెటర్లు తమ స్థానాలు, పాయింట్లను మెరుగుపర్చుకోవడం విశేషం. టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (654) మూడు స్థానాలు ఎగబాకి 9వ ర్యాంకుకు చేరింది. కివీస్పై వన్డే సెంచరీ బాదిన మంధాన ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పు లేదు. మంధాన (728) రేటింగ్ పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గతంతో పోలిస్తే 703 పాయింట్ల నుంచి 728కి చేరింది. దీంతో టాప్-3 ర్యాంకుకు చేరువగా వచ్చింది. లారా వాల్వార్డ్ట్ (756), నాట్ స్కివెర్ బ్రంట్ (760), చమరి ఆటపట్టు (733) టాప్-3లో ఉన్నారు. ఆల్రౌండర్ దీప్తి శర్మ (538) భారత్ తరఫున టాప్-20లో నిలిచిన మూడో ప్లేయర్ కావడం విశేషం. ప్రస్తుతం ఆమె ఒక ర్యాంక్ను మెరుగుపర్చుకుని 19వ స్థానంలో నిలిచింది. బౌలర్ల విభాగంలో దీప్తి శర్మ 703 పాయింట్లతో 2వ స్థానంలో నిలువగా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ (770) టాప్లో ఉంది. భారత యువ బౌలర్ ప్రియా మిశ్రా ఏకంగా 77 స్థానాలను మెరుగుపర్చుకోవడం గమనార్హం. దీంతో తొలిసారి వందలోపు ర్యాంకుల్లోకి వచ్చింది. ప్రస్తుతం 271 పాయింట్లతో 83వ స్థానం దక్కించుకుంది. రేణుకా సింగ్ (424) కూడా నాలుగు స్థానాలను మెరుగుపర్చుకుని 32వ ర్యాంకును సొంతం చేసుకుంది. ఆల్రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఒక్క ప్లేయరే భారత్ నుంచి టాప్-10లో ఉంది. ఆమె 378 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఈ విభాగంలో దక్షిణాఫ్రికా క్రీడాకారిణి మరిజన్నె కాప్ (404) అగ్రస్థానంలో ఉంది.