IND vs ENG : వరుణ్‌ ఇన్‌.. బుమ్రా ఔట్‌..

  • ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన

నాగ్‌పూర్‌: ఇంగ్లండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారతజట్టును బిసిసిఐ మరోదఫా వెల్లడించింది. గాయపడ్డ జస్ప్రీత్‌ బుమ్రా స్థానంలో వరుణ్‌ చక్రవర్తికి చోటు కల్పించింది. అలాగే సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి కూడా వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లండ్‌తో గురువారం నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు భారతజట్టు ఆడే చివరి సిరీస్‌ ఇదే కావడంతో టీమిండియా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఛాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో పెట్టుకొని బిసిసిఐ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన బోర్డు.. టి20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన వరుణ్‌ చక్రవర్తికి వన్డే జట్టులో చోటు కల్పించడం విశేషం. బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో వెన్నునొప్పి గాయంతో ఆటకు దూరమైన బుమ్రా ఛాంపియన్స్‌ ట్రోఫీ నాటికి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని సమాచారం. దీంతో ఛాంపియన్స్‌ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో బుమ్రాకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టి20ల సిరీస్‌లో 14వికెట్లతో సత్తా చాటాడు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన టి20లో ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌’గా ఎంపికయ్యాడు. నాగ్‌పూర్‌ వేదికగా మార్చి 6నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభం కానుంది. దీంతో వరుణ్‌ చక్రవర్తి టీమిండియా జట్టు సభ్యులతో కలిసి మంగళవారం ప్రాక్టీస్‌లో నిమగమయ్యాడు. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో వరుణ్‌ చక్రవర్తి 19.8 స్ట్రయిక్‌రేట్‌తో 59వికెట్లు తీశాడు. విజరు హజారే ట్రోఫీలో 12.16సగటుతో 18వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఆల్‌రౌండర్లు కాగా.. రెగ్యులర్‌ స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి మాత్రమే ఉన్నారు.

జట్టు: రోహిత్‌(కెప్టెన్‌), శుభ్‌మన్‌, జైస్వాల్‌, కోహ్లి, శ్రేయస్‌, కెఎల్‌ రాహుల్‌, పంత్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌, జడేజా, సుందర్‌, అక్షర్‌, కుల్దీప్‌, హర్షీత్‌ రాణా, షమీ, ఆర్ష్‌దీప్‌, వరుణ్‌ చక్రవర్తి.

➡️