జిల్లాకు గర్వకారణం
పారాస్పోర్ట్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు దయానంద్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : న్యూ ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో తొలిరోజు టి11 విభాగం 1500 మీటర్ల పరుగు పందెంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన క్రీడాకారిణి కిల్లక లలిత కాంస్య పతకం గెలుచుకోవడం జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.దయానంద్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన పారా క్రీడాకారులు పాల్గొన్నారని, గట్టి పోటీలో సైతం అసామాన్య ప్రతిభ కనబరచిన లలిత తానేంటో నిరూపించడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో విజయనగరం పేరు మారుమోగేలా చేసిందని ప్రశంసించారు. ఈ పతకం మన రాష్ట్ర క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహన్ని నింపిందని, ఇతర విభాగాల్లోనూ ఆమె పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన లలితకు జిల్లా కలెక్టర్ డాక్టర్. బి.ఆర్.అంబేద్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందనలు తెలియజేసారు.
