స్పోర్ట్స్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో దక్షిణాఫ్రికాకు చుక్కెదురైంది. గ్రూప్ స్టేజ్లో టాప్గా నిలిచిన సఫారీ జట్టుకు సెమీస్లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో భంగపాటు తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో డేవిడ్ మిల్లర్ శతకం బాదినా 312 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో 50 పరుగుల తేడాతో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. అయితే, షెడ్యూల్ కారణంగానే తమకు తగినంత సమయం దొరకలేదని.. స్వల్ప వ్యవధిలో దుబాయ్ కు వెళ్లి రావడం ఇబ్బందిగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ” కేవలం గంటా 40 నిమిషాల విమాన ప్రయాణమే. కానీ, అలా మేం రెండుసార్లు ప్రయాణించడం సరైంది కాదు. దుబాయ్ కు సాయంత్రం 4 గంటలకు వచ్చాం. భారత్ – కివీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత రోజు ఉదయం 7.30 గంటలకు మళ్లీ పాక్కు వచ్చేశాం. ఐదు గంటల పాటు విమానంలో ప్రయాణించినట్లు కాదు కానీ ఈ మ్యాచ్కు సన్నద్దమయ్యేందుకు మాత్రం తగినంత సమయం దొరకలేదని భావిస్తున్నాం. సెమీస్లో గెలిచిన కివీస్ తుది పోరులోనూ విజయం సాధిస్తుందని భావిస్తున్నా. తప్పకుండా గొప్ప ఫైనల్ అవుతుందని ఆశిస్తున్నా ” అని మిల్లర్ పేర్కొన్నారు. గ్రూప్ స్టేజ్లో చివరి మ్యాచ్ వరకూ సెమీస్లో ఏ జట్టు ఎవరితో తలపడుతుందనేది తేలలేదు. అప్పటికి భారత్ సెమీస్కు చేరుకోవడంతో ఆ మ్యాచ్ దుబాయ్ లోనే జరుగుతుందని షెడ్యూల్ ప్రకారం తెలిసిందే. దీంతో గ్రూప్ బి నుంచి నాకౌట్కు చేరుకున్న ఆసీస్, దక్షిణాఫ్రికా రెండు టీమ్లూ దుబాయ్ కు చేరుకున్నాయి. గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్లో కివీస్పై భారత్ గెలిచి అగ్రస్థానానికి చేరుకుంది. దీంతో తొలి సెమీఫైనల్ కోసం ఆసీస్ అక్కడే ఆగిపోయింది. దక్షిణాఫ్రికా జట్టు ఒక్క రోజు వ్యవధిలోనే దుబాయ్ నుంచి బయలుదేరి పాక్కు వెళ్లిపోయింది.
