- ఖేలో ఇండియాకు రూ.200కోట్ల పెంపు మాత్రమే
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించిన బడ్జెట్లో క్రీడలకు కంటితుడుపు పెంపు మాత్రమే కనిపించింది. గత ఏడాదితో పోల్చిచూస్తే కేవలం రూ.351.98కోట్ల పెంపు మాత్రమే జరిగింది. అలాగే 2024-25 ఏడాదిలో ఖేలో ఇండియా క్రీడలకు రూ.800 కోట్లు ప్రకటిస్తే.. ఈసారి రూ.1000కోట్లు మాత్రమే కేటాయిస్తున్నట్లు ఆర్ధికమంత్రి వెల్లడించారు. అలాగే క్రీడల బడ్జెట్లోనూ అత్యధిక శాతం ‘ఖేలో ఇండియా’ క్రీడలకు వినియోగించాలంటూ సూచించారు. ఈ క్రమంలో 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రూ.3,794.30కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇది గత ఏడాదితో పోల్చిచూస్తే రూ.351.98కోట్లు అధికం. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యమివ్వడమే లక్ష్యం అని ఊదరగొడుతున్న ప్రధాని మోడీ.. బడ్జెట్లో ఈ పెంపు ఏ మేరకు సరిపోతుందో అధికారులకే ఎరుక. గత ఏడాది ఖేలో ఇండియాకు రూ.800కోట్లు కేటాయిస్తే.. ఈసారి ఆ మొత్తాన్ని రూ.1000కోట్లకు పెంపుదల చేసింది. దీంతో జాతీయ క్రీడా సమాఖ్యలు రూ.340కోట్ల నుండి రూ.400కోట్ల సహాయాన్ని అందుకోనున్నాయి. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సహా స్వయం ప్రతిపత్తి క్రీడా సంస్థలకు రూ.1,558కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.