క్లీన్‌స్వీప్‌పై టీమిండియా గురి

  • బంగ్లాదేశ్‌తో రెండో, చివరి టెస్ట్‌ నేటినుంచే..
  • ఉదయం 9.30గం||ల నుంచి

కాన్పూర్‌: తొలిటెస్ట్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా… ఇక క్లీన్‌స్వీప్‌పై గురిపెట్టింది. కాన్పూర్‌ వేదికగా గ్రీన్‌పార్క్‌ స్టేడియంలో జరిగే రెండో, చివరి టెస్ట్‌లోనూ గెలిచి ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌(డబ్ల్యుటిసి) ఫైనల్‌కు మరింత చేరువ కావాలని టీమిండియా భావిస్తోంది. తొలి రెండు డబ్ల్యుటిసి ఫైనల్‌కు చేరి ఇప్పటికే రికార్డు నెలకొల్పిన భారత్‌.. వరుసగా మూడోసారి ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా టెస్టుల్లో సత్తా చాటుతోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 268పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్వదేశంలో తొలి అంతర్జాతీయ టెస్ట్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడు. అతడికి టీమిండియా తుది జట్టులో చోటు దక్కితే ఏడేళ్ల తర్వాత అతడు స్వదేశంలో ఓ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్నాడు. గ్రీన్‌పార్క్‌ మైదానం క్యూరేటర్‌ మాట్లాడుతూ.. ఈ టెస్ట్‌లో ఫలితం రావడం ఖాయమని పేర్కొన్నాడు. మూడోరోజునుంచి పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని, ఇరుజట్లకు గెలుపు అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్‌ మాజీ కెప్టెన్‌, ఆల్‌రౌండర్‌ షకీబ్‌ ఈ టెస్ట్‌ తర్వాత టి20 ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడంతో బంగ్లా ఆటగాళ్లంతా షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలో గ్రీన్‌ పార్క్‌లో షకీబ్‌ టెస్ట్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతాడా? స్వదేశంలో మరో టెస్ట్‌ ఆడేవరకు వేచిచూస్తాడా? అనే సందేహం అందరిలోనూ నెలకొంది.

జట్లు(అంచనా)..
భారత్‌ : రోహిత్‌(కెప్టెన్‌), జైస్వాల్‌, శుభ్‌మన్‌, కోహ్లి, పంత్‌(వికెట్‌ కీపర్‌), కెఎల్‌ రాహుల్‌, జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, ఆకాశ్‌ దీప్‌, సిరాజ్‌/బుమ్రా.

బంగ్లాదేశ్‌: నజ్ముల్‌ శాంటో(కెప్టెన్‌), షాద్మన్‌ ఇస్లామ్‌, జాకిర్‌ హసన్‌, మోమినుల్‌ హక్‌, ముష్ఫికర్‌ రహీమ్‌, షకీబ్‌, లింటన్‌ దాస్‌(వికెట్‌ కీపర్‌), మెహిదీ హసన్‌, హసన్‌ మహ్మద్‌, తస్కిన్‌/నహిద్‌ రాణా, తైజుల్‌ ఇస్లామ్‌.

➡️