ఓపెనర్లపైనే భారం.. నేడు శ్రీలంకతో కీలక పోరు

  • ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌
  • రాత్రి 7.30గం||ల నుంచి

దుబాయ్: ఐసిసి మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ చేతిలో చిత్తు ఓడిన హర్మన్‌ప్రీత్‌ సేన… రెండో టి20లో పాకిస్తాన్‌పై చెమటోడ్చి నెగ్గింది. సెమీస్‌ బెర్త్‌ రేసులో నిలవాలంటే బుధవారం శ్రీలంకతో జరిగే పోరులో టీమిండియా ఘన విజయం సాధిస్తేనే అది సాధ్యం కానుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధానా ధనా ధన్‌ బ్యాటింగ్‌తో మెరిస్తే.. ఆ తర్వాత రోడ్రిగ్స్‌, హర్మన్‌, రీచా ఘోష్‌, దీప్తి, రాణించాల్సి ఉంటుంది. పాకిస్తాన్‌పై తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి అద్భుత బౌలింగ్‌లో మెరిసింది. ఈ క్రమంలో శ్రీలంకపైనా మన బౌలర్లు పై సాధిస్తే తక్కువ పరుగులకే ప్రత్యర్ధి జట్టును కట్టడి చేయవచ్చు.

భారీ రన్‌రేట్‌ లక్ష్యంగా..
తొలి టి20లో న్యూజిలాండ్‌ చేతిలో 58 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసిన హర్మన్‌ప్రీత్‌ సేన.. పాకిస్తాన్‌పై రన్‌రేట్‌ పెంపుపై వెనుకబడింది. ఆ జట్టు నిర్దేశించిన 106పరుగుల లక్ష్యాన్ని 18.5ఓవర్లలో ఛేదించడంతో ఆ స్థాయి ప్రదర్శనతో టి20 ప్రపంచకప్‌ను సాధించాలనుకోవడం అత్యాశే అని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శ్రీలంక జట్టు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఆ జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలవాలన్న ఉత్సాహంతో ఉన్నా.. టీమిండియాపై గెలవాలంటే చెమటోడ్చాల్సింది. ఇక టీమిండియా విషయానికొస్తే.. గ్రూప్‌-ఎ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పటిష్ట ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉంది. ఆ జట్టుపై గెలిస్తేనే టీమిండియాకు సెమీస్‌ బెర్త్‌ దక్కనుంది.

జట్లు(అంచనా)..
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్‌), షెఫాలీ, మంధాన, రోడ్రిగ్స్‌, రీచా ఘోష్‌(వికెట్‌ కీపర్‌), దీప్తి శర్మ, సజన, అరుంధతి, ఆశా శోభన, రేణుక, పూజా వస్త్రాకర్‌/రాధా యాదవ్‌.

శ్రీలంక: ఆటపట్టు(కెప్టెన్‌), గుణరత్నే, హర్షిత, కవిషా, నీలాక్షి, పెరీరా, సంజీవని(వికెట్‌ కీపర్‌), సుగంధిక, రణవీర. కాంచన, నిసంసల.

➡️