డబ్ల్యుఎఫ్‌ఐ నుంచి మద్దతు లేదు : వినేశ్‌ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్‌ రాథీ

న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సంఘం (డబ్ల్యుఎఫ్‌ఐ) నుంచి మద్దతుగా లేదని భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్‌ రాథీ ఆరోపించారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఫైనల్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్‌కు ఫెడరేషన్‌ మద్దతుగా నిలవలేదన్నారు. పారిస్‌ నుండి శనివారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న వినేశ్‌ ఫొగాట్‌ కు ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చి వినేశ్‌కు స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో … వినేశ్‌ ఫొగాట్‌ భర్త సోమ్‌వీర్‌ రాథీ మాట్లాడారు. వినేశ్‌ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకుంటారా ? అనే ప్రశ్నకు సోమ్‌వీర్‌ సమాధానం ఇవ్వలేదు. విమానాశ్రయంలో అభిమానుల నుంచి వచ్చిన అపూర్వ ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. దేశం మొత్తం వినేశ్‌పై అభిమానం కురిపిస్తోందన్నారు. ఆమెకు ఘనస్వాగతం లభించిందని, ఇలా చూడటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. వినేశ్‌ సహచర రెజ్లర్లూ పెద్ద ఎత్తున అండగా నిలిచారని చెప్పారు. తాము భారత్‌లోకి అడుగు పెట్టేవరకూ ఇలాంటి సంబరాలు అస్సలు ఊహించలేదని తెలిపారు. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదన్నారు. పతకం కాస్తలో చేజారిందని అన్నారు. తామంతా క్లిష్టసమయంలో ఉన్నామని, కాస్‌లో తీర్పు మనకు అనుకూలంగా రాలేదని చెప్పారు. ఇలాంటప్పుడు ఫెడరేషన్‌ తమకు మద్దతుగా లేదని ఆరోపించారు. అథ్లెట్లకు మద్దతుగా లేకపోతే నిర్భయంగా ఎలా ప్రదర్శన చేయగలరు ? ” అని సోమ్‌వీర్‌ ప్రశ్నించారు.

➡️