Feb 09,2023 00:16

ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్‌: తమ ప్రాంతానికి వారానికోసారి తాగునీరు సరఫరా అవుతోందని, దోమలు విపరీతంగా ఉన్నాయని, ఇంటిపన్నులు వేయాలని స్థానిక 50వ డివిజన్‌ పరిధిలోని జయప్రకాష్‌కానీ ఎక్స్‌టెన్షన్‌, నేతాజీ కాలనీ ప్రజలు నగర కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావుకు విన్నవించారు. ఆయా కాలనీలలో కమిషనర్‌ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను కమిషనర్‌కు వివరించారు. ప్రధానంగా వారానికోసారి తాగునీరు సరఫరా చేస్తున్నందున తాగునీటికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని, నాలుగు రోజులకోసారి తాగునీరు అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్‌ వెంటనే ఆదేశించారు. కాలనీలలో పిచ్చిమొక్కలు తొలగించాలని సిబ్బందికి సూచించారు. డ్రమ్ముల్లో, తొట్లలో నీరు నిల్వలేకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంటిపన్నులు వేసేందుకు గాను రెవిన్యూ ఇన్స్‌పెక్టర్‌తో చర్చించారు. సూపర్‌ స్ట్రక్చర్‌ టాక్స్‌ వేయాలని ఆదేశించారు. నేతాజీ కాలనీలో రోడ్డు సమస్యను పరిష్కరించాలని స్థానికులు కమిషనర్‌ను కోరారు. రెండు రోజుల్లో పనులు ప్రారంభించిస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్‌ వెంట స్థానిక కార్పొరేటర్‌ అంబటి ప్రసాదరావు ఉన్నారు.