సమావేశంలో మాట్లాడుతున్న వై.వి సుబ్బారెడ్డి
- సిఎం సభను విజయవంతం చేయాలి
- వైసిపి రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్
వైసిపి ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈనెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ వై.వి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో దిశా నిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని చెప్పారు. నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఐదు వేలు చొప్పున రెండు లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సభ చారిత్రాత్మక సభగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలన్నారు. పార్టీ శ్రేణులు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పి చైర్పర్సన్ పిరియా విజయ, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, వైసిపి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడ తిలక్, బిసి కార్పొరేషన్ల చైర్మన్లు మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, రాజాపు హైమవతి అప్పన్న, సుడా చైర్మన్ కోరాడ ఆశాలత గుప్త తదితరులు పాల్గొన్నారు.