తెలంగాణ : గత పదేళ్లుగా ప్రభుత్వం ప్రజలకు ఎంత దూరంగా ఉందో ప్రజావాణిని చూస్తే అర్థమవుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు సంబంధించి దరఖాస్తు పత్రాన్ని బుధవారం సచివాలయంలో మంత్రులతో కలిసి రేవంత్ విడుదల చేశారు. ప్రజా పాలన పేరిట విడుదల చేసిన ఈ దరఖాస్తు ద్వారా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతుందని అన్నారు.
ఆరు గ్యారంటీల దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాల్ని పొందేందుకు ఈ ఒకే దరఖాస్తును సమర్పిస్తే సరిపోతుంది. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి, పొంగుటలేటి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంత కుమారి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చిందన్నారు. ప్రజలకు పదేళ్లుగా ప్రభుత్వం అందుబాటులో లేదని.. ప్రజావాణికి వస్తున్న స్పందనే ఆ విషయం చెబుతోందని అన్నారు. ప్రజావాణిలో అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ”ప్రజలను ప్రభుత్వం వద్దకు రప్పించడం కాదు… ప్రభుత్వమే ప్రజల వద్దకు తీసుకెళ్లమే ప్రజా పాలన ఉద్దేశం” అన్నారు. రేపటి నుంచి జనవరి ఆరో తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తారని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తామన్నారు. నిస్సహాయులకు సహాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ”ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది” అని ప్రజలను ఉద్దేశించి సిఎం రేవంత్ చెప్పారు.