సామాజిక సాధికారత వైసిపితోనే సాధ్యం

సామాజిక సాధికారత

ప్రజాశక్తి-ఏలేశ్వరం రాష్ట్రంలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీల అభివృద్ధి, సామాజిక సాధికారత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డితోనే సాధ్యమని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ అన్నారు. సామాజిక సాధికార యాత్ర 19వ రోజు ప్రతిపాడులో ఎంఎల్‌ఎ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 12 ఏళ్ల పాలనలో ప్రజల అభివృద్ధి లేదని, రెండెకరాలు ఉంటే చంద్రబాబు మాత్రం రూ.ఆరు లక్షల కోట్లు సంపాదించారన్నారు. మొత్తం ఎంఎల్‌సిలు 15 మందిలో 11 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకే కేటాయించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ దళారుల ప్రమేయం లేకుండా రూ.2,40,000 కోట్లు నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం అందజేసిందన్నారు. అభివద్ధి పథకాలకు వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బీజం వేస్తే సిఎం వైఎస్‌.జగన్‌ కొనసాగిస్తున్నారన్నారు. మాజీమంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు రాచిచ్చిన స్క్రిప్టును పవన్‌ కళ్యాణ్‌ చదువుతున్నారన్నారు. మాజీ మంత్రి కె.పార్థసారథి మాట్లాడుతూ గత ప్రభుత్వం 30 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే జగన్‌ ప్రభుత్వం 64 లక్షల మందికి పెన్షన్‌లు అందజేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ నందిగాం సురేష్‌, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎంఎల్‌ఎలు పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంఎల్‌సిలు కర్రి పద్మశ్రీ, వరుదు కళ్యాణి, హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, అలమండ చలమయ్య, శెట్టిబత్తుల కుమార్‌ రాజా, పర్వత రాజబాబు, గోళ్ల క్రాంతి సుధాకర్‌, చిక్కాల లక్ష్మణరావు, నీరుకొండ సత్యనారాయణ, సురేష్‌ తదితరులు ఉన్నారు.

➡️