ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నగర పంచాయతీలుగా అప్ గ్రేడ్ చేసిన గ్రామ పంచాయతీల్లో ఉద్యోగులను మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 12 నగర పంచాయతీల్లో పని చేస్తున్న వివిధ కేడర్లలోని 176 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులను పురపాలక శాఖ పరిధిలోకి తెచ్చేందుకు ఆ శాఖ కమిషనర్ అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం అందుకు అనుమతి ఇచ్చింది. దీంతో కొండపల్లి, కుప్పం మున్సిపాలిటీలు, దాచేపల్లి, గురజాల, పెనుగొండ, బేతంచర్ల, బుచ్చిరెడ్డిపాళెం, బి.కొత్తకోట, చింతలపూడి, పొదిలి, దర్శి, ఆకివీడు నగర పంచాయతీల్లో ఉద్యోగులను ఆయా మున్సిపల్ శాఖలోని తత్సామాన పోస్టుల్లోకి తీసుకున్నారు.
