30 గంటలు అంధకారంలోనే..

ప్రజాశక్తి – ఉండి

ఈదురుగాలులు, భారీ వర్షాల నేపథ్యంలో 30 గంటల పాటు ఉండి మండలం అంధకారంలోనే ఉందని, విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణలో అధికారులు విఫలమయ్యారని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గతంలో విశాఖపట్నంలో హుద్‌ హుద్‌ తుపాను నేపథ్యంలో 24 గంటల్లోనే విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించారని, మండలంలో ఆదివారం వీచిన ఈదురు గాలులకు విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించడానికి అధికారులకు 30 గంటలైనా సరిపోలేదని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ అభివృద్ధి చెందిన నేపథ్యంలో సెల్‌ఫోన్‌ లేకుండా జీవనం సాగించడం ఇబ్బందికరంగా మారిందని, అటువంటిది 30 గంటల పాటు విద్యుత్‌ సరఫరా స్తంభించిపోతే సెల్‌ఫోన్ల ఛార్జింగ్‌తో పాటు సిగల్స్‌ కూడా లేకుండా పోయాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా లేకపోవడం తమ వ్యాపారానికి ఆటంకంగా మారిందని విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో మండలంలోని చాలా ప్రాంతాల్లో మెయింటెనెన్స్‌ పేరిట ఉదయం నుంచి సాయంత్రం వరకూ విద్యుత్‌ లైన్లకు అడ్డంకిగా ఉన్న చెట్ల కొమ్మలను, చెట్లను తొలగించినప్పటికీ ఈదురుగాలులకు ఏ విధంగా తీగలు తెగిపడ్డాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. గృహ అవసర వినియోగదారులకు విద్యుత్‌ అందించడంలో విఫలమైన విద్యుత్‌ సిబ్బంది ఆదివారం రాత్రి పులిగుమ్మ ప్రాంతంలోని ఆక్వా చెరువులపై విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించే పనిలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఆక్వా రైతులతోపాటు తాము కూడా బిల్లులు చెల్లిస్తున్నామని తమకు విద్యుత్‌ సరఫరా చేయలేని అధికారులు ఆక్వా రైతులకు ఏ విధంగా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తున్నారని ప్రశ్నించారు. ఇదే విషయమై అధికారులకు ఫోన్‌ చేస్తే సరైన సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ఉండి పెద్దపుల్లేరు రహదారిలోని తీగలు ఆదివారం ఉదయం తెగిపోయినప్పటికీ విద్యుత్‌ సిబ్బంది సోమవారం మధ్యాహ్నం వరకూ వాటిని పరిశీలించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. గత ఎలక్ట్రికల్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌ ముదునూరి మాధవరాజు మండలంలో వేసవిలో విద్యుత్‌ కోతలు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యుత్తు అందించాలని లక్ష్యంతో పనిచేశారని కానీ నేడు వినియోగదారులకు విద్యుత్‌ అందించడంలో ప్రస్తుత అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని దీనివల్ల సోమవారం మండలంలోని పలు బ్యాంకులలో లావాదేవీలు సైతం నిలిచిపోయాయని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యుత్‌ వినియోగదారులకు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించాలని పలువురు కోరుతున్నారు.

➡️