కోకో రైతుకు వెన్నుపోటు..!

సిండికేట్‌గా మారిన కంపెనీలు
ధర కిలో రూ.370కు తగ్గించేసి దోపిడీ
అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.700కుపైనే
చేతులెత్తేసిన ప్రభుత్వం, ఉద్యాన శాఖ
ఆచరణకు నోచని వ్యవసాయ శాఖా మంత్రి ప్రకటన
తీవ్రంగా నష్టపోతున్న కోకో రైతులు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
కోకో రైతులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కోకో రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర కల్పించేలా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి చెప్పిన మాటలన్నీ ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో ధర రూ.700కుపైగా ఉన్నప్పటికీ కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి కిలో కోకోగింజలను రూ.370కు తగ్గించేసి కొనుగోలు చేయడంతో కోకో రైతులు తీవ్ర నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని, ఉద్యావనశాఖ, జిల్లా ఉన్నతాధికారులు నట్టేట ముంచేశారని కోకో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 75 వేల ఎకరాల్లో కోకో సాగవుతుండగా, జిల్లాలో అత్యధికంగా 33 వేల ఎకరాల్లో రైతులు కోకో సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల కొబ్బరిలో అంతరపంటగా కోకో ఉండగా, మరికొన్నిచోట్ల కోకో సాగును ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. కోకోను సాగు చేసేదంతా అత్యధికంగా కౌలురైతులే. ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.లక్షా పది వేల వరకూ ఏడాదికి కౌలు చెల్లిస్తూ కౌలు రైతులు కోకో సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.60 వేలు వరకూ పెట్టుబడి ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. సరాసరిన మూడు నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధర ప్రకారం కోకో రైతులకు ధర చెల్లించాల్సి ఉంటుంది. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ధరను తగ్గించేసి రైతులను దోపిడీ చేస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర కల్పించాలని రాష్ట్రవ్యాప్తంగా కోకో రైతులు గడిచిన రెండు నెలలుగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 17న అమరావతిలో ఉద్యాన శాఖ డైరెక్టర్‌ కోకో రైతులు, కంపెనీలతో చర్చలు జరిపారు. తర్వాత ఏప్రిల్‌లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి రైతులు, కంపెనీలతో చర్చలు జరిపారు. కిలో ధర రూ.550 వరకూ కొనుగోలు చేస్తామని కంపెనీలు చెప్పాయి. పాత, కొత్త గింజలను 3:1 నిష్పత్తిలో కొనుగోలు చేసేలా నిర్ణయించారు. తర్వాత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కంపెనీలు సిండికేట్‌గా తయారై రైతులను తీవ్రంగా వంచిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఉద్యానశాఖ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు సైతం కోకో రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కంపెనీలు మరింత రెచ్చిపోయి ధర అమాంతంగా తగ్గించేసి రైతులను దెబ్బతీస్తున్న పరిస్థితి నెలకొంది.కిలో ధర రూ.370కు ఢమాల్‌ కోకో గింజల ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.700కుపైగా ఉన్నట్లు రైతులు చెబుతున్నారు. కంపెనీలు శనివారం కోకో గింజలు కిలో రూ.370కు తగ్గించేశాయి. మరింత తగ్గిపోతుందని రైతులను బెదిరించి అడ్డగోలుగా కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కిలో రూ.370కు విక్రయించడంతో కనీసం కౌలు ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడిందంటూ రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. డిసెంబర్‌ నుంచి మే నెలాఖరు వరకూ కోకో సీజన్‌ ఉంటుంది. పంట వచ్చిన తరుణంలో కంపెనీలన్నీ సిండికేట్‌గా మారిపోయి ధర తగ్గించేసిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. ప్రభుత్వం కోకో రైతులకు న్యాయం చేస్తామని మాటిచ్చి వెన్నుపోటు పొడిచిందని కోకో రైతులు గగ్గోలు పెడుతున్నారు.

➡️