సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు

May 10,2025 21:34

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :   మే 20న దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతిస్తుందని వెల్లడించింది. మండలంలోని మూలజమ్మలో జరిగిన గిరిజన సంఘం కార్యక్రమంలో గిరిజన సంఘం మండల ఉపాధ్యక్షులు మండంగి సన్యాసిరావు మాట్లాడారు. గతంలో దేశవ్యాప్తంగా సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా 22 సార్వత్రిక సమ్మెలు జరిగాయని, నేడు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం ప్రధాన డిమాండ్‌తో సమ్మె జరుగుతుందని, ఎన్‌డిఎ ప్రభుత్వం కార్మికులకు చట్టాలు వర్తించకుండా చేసి బానిసలుగా చేసుకోవాలని చూస్తుందని, దీనికి రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు కూడా వత్తాసు పలకడం కార్మికులకు ద్రోహం చేయడమే అవుతుందని తెలిపారు. ఉపాధి హామీ నిధులు కుదించడం వల్ల రెగ్యులర్‌గా కూలీలకు రావాల్సిన బకాయి వేతనాలు రావడం లేదని, కేరళ ప్రభుత్వం వలే 18 రకాల నిత్యవసర వస్తువులు ప్రజలకు అందించి ,అధిక ధరల ఇబ్బందుల నుంచి ప్రజలను ఆదుకోవాలని కోరారు. కూటమి పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బిజెపి ఎన్నికలకు ముందు అన్ని చేస్తామని చెప్పి, నేడు చేతులెత్తేసాయని ఎద్దేవా చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రైవేటు సంస్థల్లోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్లతో ఈనెల 20 సమ్మె జరుగుతుందని, అందుకే ఆదివాసీ గిరిజన సంఘం న్యాయమైన డిమాండ్ల కోసం చేపడుతున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మెకు, అన్ని సెక్షన్ల ప్రజానీకం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం మండల నాయకులు పువ్వల మోహన్రావు, కె.సుబ్బారావు, నిమ్మక రామలింగం పాల్గొన్నారు.

➡️