‘యాక్సిస్‌’ ఒప్పందం రద్దు చేయాలని ధర్నా

ప్రజాశక్తి – శ్రీకాకుళం : యాక్సిస్‌, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని, స్మార్ట్‌ మీటర్లు, ట్రూ అఫ్‌, సర్‌ ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఆధ్వర్యాన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, కొత్తూరు, రణస్థలంలో విద్యుత్‌శాఖ కార్యాలయాల వద్ద శుక్రవారం ధర్నాలు నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఇపిడిసిఎల్‌ ఎస్‌ఇ కార్యాలయం వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి మాట్లాడుతూ.. యూనిట్‌ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున కొనుగోలు చేసేందుకు యాక్సిస్‌ కంపెనీతో రాష్ట్ర డిస్కమ్‌లు కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికలకు ముందు సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పెంచడం ప్రజలను దగా చేయడమేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌ మీటర్లు పగులగొట్టాలని చెప్పి, ఇప్పుడు వాటిని పెట్టడం దుర్మార్గమని తెలిపారు. రాష్ట్ర ప్రజలపై పాతికేళ్ల పాటు రూ.15 వేల కోట్ల భారం వేసే ఈ ఒప్పందాన్ని ఎపిఇఆర్‌సి ఆమోదముద్ర వేయడం అన్యాయమన్నారు. విద్యుత్‌ కొనుగోలు పేరుతో ప్రజలపై అదనపు భారం మోపేలా కుదుర్చుకున్న యాక్సిస్‌ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.తేజేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

➡️