దిగ్విజయంగా ముగిసిన వ్యక్తిత్వ వికాస సదస్సు యువత భవిష్యత్తు సమాజ శ్రేయస్సుకు దిక్సూచికావాలిజిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు పిలుపుప్రజాశక్తి తిరుపతి సిటీ విలువలతో కూడిన విజ్ఞానంతో పాటు క్రమశిక్షణతో సన్మార్గంలో పయనిస్తూ ఉన్నత లక్ష్యాలు సాధనతో యువత సమాజ శ్రేయస్సుకు దిక్సూచికలుగా నిలవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ యువతకు పిలుపు నిచ్చారు. డాలర్స్ గ్రూప్ ఛారిటబుల్ ట్రస్ట్ సహకారంతో మెగా ఇంపాక్ట్ అధ్వర్యంలో గత రెండు రోజుల పాటు మహతి కళాక్షేత్రంలో చేపట్టిన ఉచిత వ్యక్తిత్వ వికాస సదస్సు బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ యువతనుద్దేశించి మాట్లాడుతూ సాధించాలనే సంకల్పం ఉంటే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం సులభతరమన్నారు. విద్యా విజ్ఞానంతో పాటు సామర్థ్యం, నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే యువత ఉజ్వల భవిత సుసాధ్యమన్నారు. విద్యావంతులైన యువతలో నైపుణ్యాలను మెరుగు పరిచి వారి ఉన్నతికి తోడ్పడాలనే లక్ష్యంగా డాలర్స్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్రెడ్డి మేధస్సు కలిగిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుల ద్వారా శిక్షణ కల్పించడం స్ఫూర్తిదాయకమన్నారు. మరో అతిథి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ జీవితాలను విచ్చన్నం చేసే డ్రగ్స్, మత్తు పదార్థాల పట్ల యువత జాగృత వహించి, మానవీయతా దృక్పథంతో తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. ఎంతో శ్రమతో బిడ్డల ఉన్నతిని ఆకాంక్షించే తల్లిదండ్రుల కలలను సాకారం చేసే దిశగా యువతీ యువకులు ముందడుగు వేసి ఉత్తములుగా ఎదగి సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. సేవా దృక్పథంతో చేపట్టే ఇలాంటి సదస్సులను యవత సద్వినియోగం చేసుకొని తమ భవిషత్కు పునాదులు వేసుకోవాలన్నారు. అనంతరం సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశ భవిషత్లో యువత ఎంతో కీలకమని తెలిపారు. అయితే నేటి ఆధునిక సమాజంలో సోషియల్ మీడియా, డ్రగ్స్, రీల్స్ వంటి యువతను మానసికంగా దెబ్బతీస్తోందన్నారు. వీటి పట్ల యువత జాగృతతో ఉంటూ జీవిత లక్ష్య సాధనలో ముందడుగు వేయాలన్నారు. దేశ ప్రగతిలో స్ఫూర్తిదాతలైన వివేకానంద, ఆదిశంకరాచార్య, రామానుజ, భగత్ సింగ్, సుఖేవ్ వంటి మహనీయుల జీవితాలను ఆదర్శకంగా తీసుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు శ్రీపాదమ్ మాట్లాడుతూ యువత ఉజ్వల భవితకు మార్గదర్శకాలను దిశా నిర్దేశం చేశారు. అనంతరం డాలర్ గ్రూప్ అధినేత డాలర్ దివాకర్రెడ్డి అతిధులును, వక్తలను ఘనంగా సత్కరించి అభినందించారు. యువత భవితను కాంక్షిస్తూ తాము. నేపట్టిన సదస్సు విశేష స్పందన లభించడం అభినందనీయమన్నారు. భవిషత్లో మరిన్ని స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలతో సమాజ హితం కోసం కృషి చేస్తామని తెలిపారు. రెండు రోజుల పాటు సాగిన వ్యక్తిత్వ వికాస సదస్సుకు ఉమ్మడి చిత్తూరు జిల్లానుంచి అధిక సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు.