వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ
పని ప్రదేశాల్లో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి
ప్రజాశక్తి – ఏలూరు
ఉపాధి హామీ కూలీలకు గత ఫిబ్రవరి 1 నుండి నేటికీ వేతనాలు విడుదల చేయలేదని, బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏలూరు మండలం మల్కాపురం పంచాయతీ రైల్వేగేట్ వద్ద ఉపాధి పనులు చేస్తున్న కూలీలతో నేతలు మాట్లాడారు. అనంతరం కూలీలతో కలిసి బకాయిలు విడుదల చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీల వేతనాలను సకాలంలో విడుదల చేయాలని కోరారు. చట్టప్రకారం 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇస్తామని చెప్పడం తప్ప నెలలు తరబడి పెండింగ్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వాలు చెప్పే దానికి, చేసే దానికి పొంతన లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. కూలీలకు పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తాగునీరు, మజ్జిగ, మెడికల్ కిట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రవాణా ఛార్జీలు పేదల ఖాతాల్లో వేయాలని కోరారు. ఆన్లైన్ మస్తర్ పద్ధతిని ఎత్తివేసి, మాన్యువల్గానే మస్తర్ వేయాలని కోరారు. బకాయి వేతనాలు సుమారు రూ.62 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు, మేట్లు వందలాది మంది పాల్గొన్నారు. జీలుగుమిల్లి: ఉపాధి కూలీల వేతనాలు వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేశారు. సంఘం నేతలు కామయ్యపాలెంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు గుడెల్లి. వెంకట్రావు మాట్లాడుతూ బకాయిలు చెల్లించకుండా ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల పనులు చేపట్టడం ఏమిటని, కూలీల కడుపు నిండేదెలాగని ప్రశ్నించారు. తక్షణం బకాయిలు చెల్లించాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 22న మండల కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సిరిబత్తుల సీతారామయ్య, కారం నాగదుర్గ పాల్గొన్నారు. బుట్టాయగూడెం: ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరించాలని, పే స్లిప్ ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ డిమాండ్ చేశారు. సోమవారం రేకులకుంట, పాలకుంట గ్రామాల్లో ఉపాధి పనులు నిర్వహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కూలీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కూలీలకు పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు, టెంట్, తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. కూలీలకు ఇవ్వాల్సిన రవాణా ఛార్జీలు నేటికీ అందలేదన్నారు. ఉపాధి పని చేస్తున్న ప్రతి కుటుంబానికీ రెండొందల రోజుల పని, రూ.600 వేతనం ఇవ్వాలని కోరారు.
