ప్రజాశక్తి-పార్వతీపురం : జిల్లాలో ప్రధాన మంత్రి జన్మన్ పివిటిజి ఇళ్ల నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని కలెక్టర్ ఎ.శ్యామ్ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు ప్రధాన మంత్రి జన్మన్ పివిటిజి ఇళ్ల నిర్మాణం పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ప్రధాన మంత్రి జన్మన్ పివిటిజి పథకం కింద 2697 ఇళ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మార్చి 31 నాటికి 184 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇంటి స్థలం పొందిన ప్రతిఒక్కరూ నిర్మాణ పనులను మొదలు పెట్టాలన్నారు. మార్చి 31లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో కురుపాం, గుమ్మలకీëపురం, సీతంపేట మండలాల్లో ఇంకా మెరుగైన అభివృద్ధి సాధించే దిశగా కృషి చేయాలన్నారు. గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు రహదారి, మెటీరియల్ కాంపౌనెంట్ లే ఔట్కి దగ్గర్లో ఉండేలా చూడాలని తెలిపారు. మంజూరైన ఇళ్ల స్థలాల్లో కచ్చితంగా నిర్మాణం చేపట్టాలని, ఈ నెలలో కనీసం పది ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పునాదుల స్థాయి నుండి ఇంటి నిర్మాణం పూర్తి చేసేలా మెరుగవ్వాలని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ సంస్థ పీడీ ఆర్.వంశీకృష్ణ, డిఇలు జి.సోమేశ్వరరావు, ఎం.వెంకటరావు, ఐటి మేనేజర్ పి.అనిల్కుమార్, సిఎల్టిసి పి.అరుణకుమారి పాల్గొన్నారు.