రోడ్లన్నీ మరమ్మతులు చేసి ప్రయాణం సాఫీగా సాగేలా అభివృద్ధి చేస్తున్నాం.. ఇదీ కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం చెబుతున్న మాటలు. అయితే జాతీయ రహదారి నుంచి పంచాయతీరాజ్ రోడ్ల వరకూ ఇంజినీరింగ్ లోపాల వల్ల చోటుచేసుకుంటున్న ప్రమాదాలపై ఎవరూ దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసిపి ప్రభుత్వ హయాంలో రోడ్ల అభివృద్ధి మాట అటుంచి నిర్వహణను సైతం గాలికొదిలేయడంతో జనం నానావస్థలు పడ్డారు. ఎన్నికల ముందు రోడ్లు వేస్తున్నట్లు ఆ ప్రభుత్వం హడావుడి చేసినా ఆ పనులు చాలా పరిమితంగానే సాగాయి. కూటమి అధికారంలోకి రాగానే సంక్రాంతిలోపు రోడ్లన్నింటికీ మరమ్మతులు నిర్వహించారు. గోతులు పూడ్చటంతో వాహనదారుల కష్టాలు కొంత తొలగాయి. దీంతో జనం కొంత ఉపశమనం పొందారనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అయితే తాజాగా జాతీయ రహదారులు, ఆర్అండ్బి రోడ్లపై ప్రమాదాలు పెరగడంతో మరోసారి రోడ్ల పనులపై చర్చ తెరపైకి వచ్చింది. జాతీయ రహదారిపై ఇటీవల గుండుగొలను, కలపర్రు టోల్ప్లాజా సమీపంలో కార్లు డివైడర్ దాటి దూసుకొచ్చి ఎదురుగా వస్తున్న కార్లను ఢకొీనడం గగుర్పాటు కల్గించింది. ఉంగుటూరు మండలం బాదంపూడి శివార్లలో జాతీయ రహదారికి సమీపంలో లారీ ఆర్టిసి బస్సును ఢకొీన్న తీరు అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. ఆర్టిసి డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఇక్కడ కూడా ఇంజినీరింగ్ లోపాల వల్లే ప్రమాదం జరిగిందని చెప్పొచ్చు. ఇటీవల జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను మంత్రి పార్థసారధి, జిల్లా అధికారులు పరిశీలించి పలు చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు. సమావేశ నిర్ణయాలు చూస్తే అద్భుతం, చేతలే తిరోగమనం అన్నట్లు ఉంది వాస్తవ పరిస్థితి. ఇప్పటికీ పెట్రోలింగ్ వాహనాలు జాతీయ రహదారి ప్రధాన కూడళ్ల వద్దో, లేక ఫ్లరు ఓవర్ల కింద నిలిపి ఉంచడమే తప్ప పెట్రోలింగ్ పెద్దగా నిర్వహించడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పటికీ జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేస్తున్న పరిస్థితి ఉంటోంది. అయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారు. అలాగే జాతీయ రహదారిపై అపసవ్య దిశలో వాహనాలు ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. కైకరం, పూళ్ల తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నా పెట్రోలింగ్ పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవు. ఇదే పరిస్థితి ఇటు కొయ్యలగూడెం-జీలుగుమిల్లి, గుండుగొలను-కొవ్వూరు జాతీయ రహదారులపైనా పెట్రోలింగ్ అధ్వానంగా ఉందనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఇక ఇంజినీరింగ్ లోపాలు పరిశీలిస్తే ఏలూరు-గుండుగొలను వరకూ చూసినా ఫ్లరు ఓవర్ల నిర్మాణం సమయంలోనే కుంగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. వాహనాల రాకపోకలు సాగుతున్న తరుణంలో ఫ్లరు ఓవర్ల పైకి వెళ్లేసరికి రోడ్డు ఎగుడు, దిగుడుగా ఉండటంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. వాటిని శాశ్వత ప్రాతిపదికన సరి చేసే ప్రయత్నం చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక రోడ్ల నిర్వహణతోపాటు మార్జిన్ల నిర్వహణా చాలా కీలకం. ఎప్పటికప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేయడంతోపాటు మార్జిన్లు సక్రమంగా ఉంటే చాలా వరకూ ప్రమాదాలను నియంత్రించే అవకాశం ఉంది. అయితే బాదంపూడి వద్ద రోడ్డు మార్జినే కానరాని పరిస్థితి ఉండటంతో లారీ బస్సుపైకి దూసుకెళ్లింది. తర్వాత మార్జిన్ కొంత సరి చేసే ప్రయత్నం తూతూమంత్రంగా చేశారు తప్ప శాశ్వత ప్రాతిపదికన ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. ఇదే పరిస్థితి తాడేపల్లిగూడెం-కోడేరు రోడ్డులోనూ కన్పిస్తోంది. ఇలా చాలా చోట్ల రోడ్లు నిర్మించేసి చేతులు దులుపుకోవడం తప్ప దానికి అనుగుణంగా మార్జిన్ను ఎత్తు చేయడం వంటి చర్యలు చేపట్టకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు సమీక్షలతో సరిపెట్టకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులు చక్కదిద్దేలా రోడ్ల అభివృద్ధికి, మార్జిన్లలో లోపాలు సరి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనడంలో అతిశయోక్తి లేదు. – విఎస్ఎస్వి.ప్రసాద్
