వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలకు రూ.2.25 కోట్లు

కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి
కౌలు రైతులకూ పరికరాలు ఇవ్వాలి
కౌలురైతుసంఘం నేత కొర్ని అప్పారావు
ప్రజాశక్తి – ఉంగుటూరు
అధునాతన పరికరాలతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు సాధించేందుకు జిల్లాకు రూ.2.25 కోట్లు నిధులొచ్చాయని జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంగుటూరు, నిడమర్రు, భీమడోలు మండలాల రైతులకు రాయితీపై మంజూరైన పరికరాలను శనివారం పంపిణీ చేశారు. ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజు నూతన క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథి వెట్రిసెల్వి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ఎంఎల్‌ఎ ధర్మరాజు కోరిక మేరకు రూ.30 కోట్లు ఇచ్చామని, వాటిని సద్వినియోగ చేశారని అన్నారు. రైతుల సహకారంతో అధిక పంట దిగుబడులు సాధించి జిల్లాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ జెడి హబీబ్‌ భాషా మాట్లాడుతూ ధాన్యం సేకరణలో లక్ష్యాన్ని దాటామని, అదనంగా 2.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు అనుమతులు వచ్చాయని తెలిపారు. కౌలురైతు సంఘం నాయకుడు కొర్ని అప్పారావు మాట్లాడుతూ పరికరాలను భూయజమానులతోపాటు కౌలురైతులకు ఇస్తేనే ఉపయోగకరమన్నారు. నిడమర్రుకు చెందిన ఓ రైతు మాట్లాడుతూ పంట, మురుగు బోదెలు ఆక్రమణలతో పూడుకుపోయాయన్నారు. రాయితీపై ధాన్యం ఆరబోసే డ్రయ్యర్‌ ఇవ్వాలని రైతులు కోరారు. ధాన్యం ఆరపెట్టేందుకు సామూహిక కళ్లాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని మరోరైతు చెప్పారు. అనంతరం ఎంఎల్‌ఎ ధర్మరాజు మాట్లాడారు. కార్యక్రమంలో ఉంగుటూరు, నారాయణపుం సర్పంచులు బండారు సింధు, దిడ్ల అలకనంద, ఎంపిపి గంటా శ్రీలక్ష్మి, బిజెపి నేత శరణాల మాలతీరాణి, వైస్‌ ఎంపిపి సింగిరెడ్డి సూర్యనారాయణ, నేత నాయకులు సూరత్తుల అయ్యప్ప, భీమడోలు ఎడిఎ ఉషారాజకుమారి, వ్యవసాయాధికారులు, తహశీల్దారు పాలపర్తి రవికుమార్‌, ఎంపిడిఒ రాజ్‌మనోజ్‌ పాల్గొన్నారు.ఎండలోనే నిలబడిన రైతులు ఉదయం 9.30 గంటలకే సమావేశానికి చేరుకున్న రైతులు, పలువురు కూటమి నాయకులు కుర్చీలు లేక ఎండలోనే గంటల తరబడి నిలబడాల్సి వచ్చింది. అసలే ఎండాకాలం.. సరిపడా టెంట్లు, కుర్చీలు వేయడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు రైతులు విమర్శించారు. చేబ్రోలు ఇసుక స్టాక్‌ పాయింట్‌ను పరిశీలించిన కలెక్టర్‌ చేబ్రోలు ఇసుక స్టాక్‌ పాయింట్‌ను కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి, ఉంగుటూరు ఎంఎల్‌ఎ పత్సమట్ల ధర్మరాజుతో కలిసి శనివారం పరిశీలించారు. స్టాక్‌ పాయింట్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఫెన్షింగ్‌ వేయించాలని అధికారులను ఆదేశించారు.

➡️