మే నెలాఖరులోగా సారా రహిత జిల్లా

Apr 22,2025 21:28

 ముడిసరుకుల అమ్మకాలపై దష్టి పెట్టాలి

ఫిర్యాదులకోసం టోల్‌ఫ్రీ నెంబరు 14405

జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌

ప్రజాశక్తి-విజయనగరం :   మే 31 నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ కోరారు. నాటు సారాకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబరు 14405 కు విస్తత ప్రచారం కల్పించాలని సూచించారు. ఎపి ప్రభుత్వ ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో నాటుసారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ, గ్రామాల్లో ఎక్కడా సారా తయారీ గానీ, వినియోగం గానీ జరగడం లేదని అన్ని పంచాయితీల నుంచి తీర్మానాలు తీసుకొనే ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని కోరారు. మండలాల నుంచి తీర్మానాలను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అవగాహనా కార్యక్రమాలను విస్తతంగా నిర్వహించాలని ఆదేశించారు. సారా తయారీ, రవాణా, విక్రయాలపై మరింత నిఘా పెట్టాలని, అలాగే ముడి పదార్ధాల కొనుగోలు, రవాణాపైనా దృష్టి సారించాలని సూచించారు. సారా తయారీ, అమ్మకాల వృత్తి నుంచి బయటపడిన 56 కుటుంబాలకు రుణాలు, ఆటోలు తదితర ఉపకరణాలను అందజేసేందుకు కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. ఏ గ్రామంలోనైనా గ్రామసభ పెట్టి తీర్మానం తీసుకున్న తరువాత కేసు నమోదు కాకూడదని స్పష్టం జెసి చేశారు. జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమం అమలు, తీసుకున్న చర్యలను ఎక్సైజ్‌ సూపరింటిండెంట్‌ బి.శ్రీనాధుడు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో డిఆర్‌ఒ ఎస్‌.శ్రీనివాసమూర్తి, డిఎంఅండ్‌హెచ్‌ఒ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డిఆర్‌డిఎ పీడీ ఎ.కల్యాణచక్రవర్తి, డిసిహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.అప్పలనాయుడు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డిఎస్‌పి వీరకుమార్‌, అబ్కారీ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️