అమరావతి : విద్యార్థుల కోసం మేము ేమీ చేయలేకపోతున్నాం అంటూ ఓ ఉపాధ్యాయుడు ఆవేదన చెందుతూ విద్యార్థుల ఎదుట గుంజీలు తీసి.. వారికి దండం పెట్టారు. విజయనగరం జిల్లాలో బొబ్బిలి మండలం పెంటగ్రామలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు రమణ తనను శిక్షించుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుత రోజుల్లో పిల్లలకు చదువు రాకపోతే వాళ్లకి బుద్ధి నేర్పే పద్ధతిలో మేం ఏమన్నా చెప్పినా.. వారిని దండించినా.. వెంటనే మా పై అధికారులు, తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటున్నారు. మేం మిమ్మల్ని కొట్టలేం.. తిట్టలేం.. ఏమీ చేయలేం.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థతుల్లో మేం ఏమి చేయాలో మాకు తోచడం లేదు. ప్రస్తుతం మేమున్న పరిస్థితుల్లో మీకు (విద్యార్థులకు) మేము ఏమీ చేయలేకపోతున్నాం. అందుకు మమ్మల్ని క్షమించండి అంటూ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు రమణ దండం పెట్టారు. స్టేజ్పై గుంజీలు తీశారు. ప్రస్తుత ఉపాధ్యాయుల పరిస్థతికి అద్దం పడుతున్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
కాగా, దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. “విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్టర్ చింత రమణ గారు పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయక్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది, అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషిచేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం..” అంటూ మంత్రి నారాలోకేష్ ట్వీట్ చేశారు.