ప్రజాశక్తి-అరకులోయరూరల్:అరుకు రైల్వే స్టేషన్ పరిధిలో పని చేస్తున్న రన్నింగ్ రూమ్, కార్మికులు, స్లిప్పర్స్, గెస్ట్ హౌస్లో, రైల్వే ట్రాక్లో పని చేస్తున్న కార్మికులకు చట్ట ప్రకారం కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అరకు రైల్వే స్టేషన్ రన్నింగ్ రూమ్ అధికారికి రైల్వే కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ( సిఐటియు) అనుబంధం ఆధ్వర్యంలో డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాల నుండి పని చేస్తున్న కార్మికులకు రైల్వే కాంట్రాక్టర్లు చట్ట ప్రకారం జీతాలు చెల్లించకుండా రైల్వే బోర్డు ఇస్తున్న వేతనంలో కోత విధిస్తున్నారని తెలిపారు. పిఎఫ్, ఈఎస్ఐ పేరుతో జీతాల్లో కోత విధిస్తున్నారన్నారు. విశాఖ డిఆర్ఎంకి కాంట్రాక్టర్పై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.