
ప్రజాశక్తి-బొబ్బిలి : ప్రభుత్వం ఊరకనే జీతాలు ఇవ్వడం లేదని, విద్యార్థులకు బాగా చదువు చెప్పకపోతే రిమూవ్ చేస్తామని గురుకుల పాఠశాల సెక్రటరీ నర్సింహ రావు, ప్రిన్సిపాల్ రఘునాధరావుపై విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బొబ్బిలి గురుకుల పాఠశాలను గురువారం రాత్రి ప్రవీణ్ప్రకాష్ తనిఖీ చేశారు. ఐదో తరగతి విద్యార్థుల పాఠ్యపుస్తకాలను, నోట్బుక్స్ను పరిశీలించగా గణితం సెమిస్టర్ - 1 సక్రమంగా చెప్పక పోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కోట్లు రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వం వర్క్ బుక్స్ ఇస్తే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించకపోవడం సరికాదన్నారు. బాధ్యతగా పని చేయకపోతే క్షమించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకునే ధైర్యం లేదా అని గురుకుల పాఠశాల సెక్రటరీ నరసింహరావును ప్రశ్నించారు. మైనర్ చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందని, మేజర్ చర్యలు తీసుకునే హక్కు ప్రిన్సిపాల్ సెక్రటరీకు మాత్రమే ఉందని నరసింహరావు సమాధానం చెప్పారు. గురుకుల పాఠశాలలను ఎన్నిసార్లు తనిఖీ చేస్తున్నారని ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించగా నెలకు ఒకసారి తనిఖీ చేస్తున్నామని గురుకుల పాఠశాల సెక్రటరీ చెప్పారు. తనిఖీ చేస్తే ఇలా ఎందుకు ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సక్రమంగా పని చేయని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కరోజు సమయం ఇస్తే చర్యలు తీసుకుంటామని నరసింహ రావు అన్నారు. విద్యార్థులను తరగతి గది నుంచి బయటకు పంపివేసి గురుకుల పాఠశాల సెక్రటరీ, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కెజిబివి పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులతో మాట్లాడి అక్కడ సౌకర్యాలపై ఆరా తీశారు. విద్యార్థినులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వినియోగించుకొని మరింత రాణించాలని సూచించారు.