
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : జిల్లాలో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల కింద 36,391 మంది విద్యార్థులు లబ్ధి పొందారనికలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లాలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులు విడుదల చేసిన దృశ్యాన్ని కలెక్టరేట్ లో కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 32,909 మంది తల్లుల ఖాతాలోకి రూ. 22. 85 కోట్ల పైచిలుకు మొత్తాన్ని ముఖ్యమంత్రి జమ చేశారన్నారు. పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసన్ తదితర కోర్సుల విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలన్న లక్ష్యంతో విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారన్నారు. ఇందులో 4912 మంది ఎస్సీ విద్యార్థులు, 2044 మంది ఎస్టి విద్యార్థులు, 19,356 మంది బీసీలు, 3785 మంది ఈ బీసీలు, 3431 మంది మైనార్టీలు, 2836 మంది కాపు విద్యార్థులు, క్రిస్టియన్ విద్యార్థులు 27 మందికి లబ్ధి చేకూరుతోందన్నారు. అనంతరం మెగా నమూనా చెక్కును కలెక్టర్ విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, బీసీ, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహనరావు, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.