- 15మంది మృతి, మరో 15మందికి గాయాలు
డమాస్కస్ : ఉత్తర సిరియాలోని మన్బిజ్ నగర శివార్లలో కారు బాంబు పేలిన ఘటనలో 15మంది మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. వ్యవసాయ కూలీలను తీసుకెళుతున్న వాహనానికి పక్కనే గల కారును బాంబులతో పేల్చివేయడంతో 14మంది మహిళలు, ఒక పురుషుడు మరణించారని స్థానిక పౌర రక్షణ దళాలు తెలిపాయి. మరో 15మంది మహిళలు గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా వుందని వెల్లడించాయి. అయితే ఈ దాడిలో 18మంది మహిళలు, ఒక పురుషుడు మరణించారని సిరియా మానవ హక్కుల పర్యవేక్షణా సంస్థ వెల్లడించింది. అలాగే, కేవలం నెల రోజుల వ్యవధిలో మన్జిబ్ నగరంలో ఇది ఏడవ కారు బాంబు పేలుడు ఘటన అని పౌర రక్షణ దళాల డిప్యటీ డైరెక్టర్ మునీర్ ముస్తఫా తెలిపారు. ఇలా వరుస దాడులు జరుగుతుంటే సిరియాలో యుద్ధానంతరం చేపడుతున్న భద్రత, ఆర్థిక పునరుద్ధరణ కార్యకలాపాలు నిలిచిపోతాయని ఆయన హెచ్చరించారు. డిసెంబరులో అసద్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా మన్జిబ్ నగరంలో హింస కొనసాగుతునే వుంది. శనివారం జరిగిన మరో కారు బాంబు పేలుడలో నలుగురు పౌరులు మరణించగా 9మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.