మొజాంబిక్ (ఆఫ్రికా) : కలరా భయంతో ప్రధాన భూభాగాన్ని వీడేందుకు పడవలో బయల్దేరిన ఆ పడవ సముద్రంలో మునిగిపోవడంతో 94 మంది చనిపోయారు. మరో 26 మంది గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ఆఫ్రికాలోని మొజాంబిక్లో ఆదివారం చోటుచేసుకుంది.ప్రమాద సమయంలో పడవలో 130 మంది ఉన్నారు. అధిక సంఖ్యలో ప్రయాణికులను పడవలో ఎక్కించుకోవడమే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు..మృతుల్లో చాలా మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు. సహాయక సిబ్బంది ఐదుగురిని ప్రాణాలతో రక్షించారని, మిగతా వారి కోసం గాలిస్తున్నారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత పేదదేశాల్లో ఒకటైన మొజాంబిక్లో అక్టోబర్ నుంచి దాదాపు 15,000 కలరా కేసులు నమోదయ్యాయి. 32 మరణాలు సంభవించాయి. ఎక్కువగా నంపులా ఫ్రావిన్స్ ప్రభావితమైంది. పడవ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
