- అలాంటిదేమీ లేదన్న ట్రంప్
వాషింగ్టన్ : వైట్హౌస్లో అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం సందర్భంగా ప్రభుత్వ సీనియర్ సలహాదారు ఎలన్ మస్క్, విదేశాంగ మంత్రి మార్క్ రూబియోల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. అలాంటిదేమీ లేదని, వారిద్దరు చక్కగా కలిసి పని చేసుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. రూబియోతోనే కాకుండా రవాణా శాఖ మంత్రి సియాన్ డఫీతో కూడా మస్క్ వాదన పెట్టుకున్నారని న్యూయార్స్ టైమ్స్ కథనం వెలువరించింది. ప్రభుత్వ శాఖల వ్యయాన్ని తగ్గించే బాధ్యతలను చేపట్టిన డోజ్కు మస్క్ నేతృత్వం వహిస్తుండగా, ఇందులో భాగంగా అనేక ఉద్యోగాల్లో కోతలు విధిస్తుండటంపై గురువారం నాటి సమావేశంలో వాదన జరిగినట్టు తెలిపింది. ఉద్యోగాల్లో కోతలు కొనసాగుతాయని, అయితే గొడ్డలితో బదులుగా కత్తిని ఉపయోగిస్తామని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ వివాదం గురించి శుక్రవారం ట్రంప్ను విలేకర్లు ప్రశ్నించగా, అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఎలంటి ఘర్షణ లేదు, నేను అక్కడే వున్నానని చెప్పారు. పదే పదే పట్టుబట్టి ప్రశ్నించగా మస్క్, రూబియో అద్భుతంగా తమకు అప్పగించిన పనులు చేస్తున్నారని అన్నారు.
అసలు కారణం ?
విదేశాంగ శాఖలో వ్యయం తగ్గింపు చర్యల గురించి ప్రశ్నిస్తూ మస్క్, మొదటి 45రోజుల కాలంలో రూబియో ఒక్కరిని కూడా ఉద్యోగం నుండి తొలగించలేదని వ్యాఖ్యానించారు. దీనికి రూబియో ఘాటుగా స్పందించారు. ఇప్పటికే 1500మంది విదేశాంగ శాఖ ఉద్యోగులు ముందుగానే పదవీ విరమణ చేయడానికి అంగీకరించారని, ఒకవేళ తాను ఎవరినన్నా తీసేయాలనుకుంటే ఆ 1500మందిని మళ్లీ విధుల్లోకి తీసుకుని, తొలగించాలని వ్యంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు రవాణా శాఖ మంత్రి డఫీతో మస్క్కు చిన్నపాటి ఘర్షణ నెలకొంది. కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లను తొలగించడానికి మస్క్ ప్రయత్నిస్తున్నారని డఫీ ఆరోపించారు. దానిపై మస్క్ స్పందిస్తూ ఆయన అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. ఈలోగా ట్రంప్ జోక్యం చేసుకుని వాదనలను సద్దుబాటు చేయడానికి ప్రయత్నించారు. ఇకపై ప్రతిష్టాత్మకమైన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్న మేథావుల నుండి కంట్రోలర్లను నియమించాల్సి వుందని వ్యాఖ్యానించారు.