ఇజ్రాయిల్ తాజా దాడుల్లో ఐదుగురి మృతి
జెరూసలేం, గాజా: 460రోజుల పాటు ఇజ్రాయిల్ సైనిక బలగాలు అమెరికా, పశ్చిమ దేశాల మద్దతుతో జరిపిన దారుణ మారణ హోమంలో 46,788మంది పాలస్తీని యన్లు ప్రాణాలు కోల్పోయారు. 1,10,453 మందిని గాయపరిచిన తర్వాత ఎట్టకేలకు ఇజ్రాయిల్ – హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోద ముద్ర లభించింది. అయినప్పటికీ, ఇజ్రాయిల్ దాడులు కొనసాగుతునే వున్నాయి. శనివారం తెల్లవారు జామున జరిగిన దాడిలో ఐదుగురు మరణించారు. శుక్రవారం పొద్దుపోయిన తర్వాత డ్రోన్దాడిలో మరో ముగ్గురు చనిపోయారు.
పాలస్తీనియన్లకు హిజ్బుల్లా అభినందనలు
ఇజ్రాయిల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్న పాలస్తీనియన్లకు హిజ్బుల్లా నేత నయీమ్ ఖాసిమ్ అభినందనలు తెలిపారు. 2024 మేలో ఏదైతే ప్రతిపాదించబడిందో అదే ఒప్పందం మార్పు లేకుండా ఇప్పుడు కుదిరిందని, దీన్నిబట్టి ఇజ్రాయిల్ తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు రుజువైందని వ్యాఖ్యానించారు. ఈ దాడుల తర్వాత గాజాలో పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టడానికి పాలస్తీనా అథారిటీ సన్నాహాలు పూర్తి చేసిందని పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్ తెలిపారు. నిర్వాసితులైన పాలస్తీనియన్లు గాజాకు తిరిగి రావడానికి సమాయత్తమవుతున్నారు.