ఇస్లామాబాద్ : భారత్ సైనిక దాడులను ఆపితే.. ఉద్రిక్తతలను తగ్గించే విషయాన్ని తమ దేశం పరిశీలిస్తుందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శనివారం తెలిపారు. పాకిస్తాన్ ప్రతిస్పందిస్తే ఉద్రిక్తతలను తగ్గించకుండా ఉండటానికి కట్టుబడి ఉన్నామని భారత్ ప్రకటించిన తరువాత పాక్ మంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించారు. భారత్ దాడులు చేస్తే మా దేశం కూడా దాన్నే అనుసరిస్తుందని తెలిపారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో కూడా ఇదే విషయాన్ని తెలియచేసినట్లు పాక్ మంత్రి తెలిపారు.
పాక్ గగనతలంలో అన్ని విమానాలకు అనుమతి
తమ గగనతలంలో అన్ని రకాల విమానాల రాకపోకలకు అనుమతి ప్రారంభించినట్లు పాకిస్తాన్ శనివారం ప్రకటించింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన కొన్ని గంటలకే పాకిస్తాన్ విమానాశ్రయాల అథారిటీ (పిఎఎ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘దేశంలో అన్ని విమానాశ్రయాలు సాధారణ విమాన కార్యకలాపాలకు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణీకులు తమ విమానాల రాకపోకల తాజా షెడ్యూల్ కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలి’ అని ప్రకటనలో తెలిపింది.