border issue : బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌కి భారత్‌ నోటీసులు

న్యూఢిల్లీ :   సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నురల్‌ ఇస్లామ్‌కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులచ్చింది. భారత్‌ -బంగ్లాదేశ్‌ల మధ్య ఐదు ప్రాంతాల్లో కంచెలు వేయనున్నట్లు హోం వ్యవహారాల సలహాదారు జహంగీర్‌ ఆలం చౌదరి ఆదివారం మీడియాకు వెల్లడించిన వెంటనే బంగ్లాదేశ్‌ విదేశాంగ శాఖ భారత హైకమిషనర్‌ ప్రణరు వర్మకు జనవరి 12న నోటీసులు జారీ చేసింది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిర్మాణాలు ప్రారంభించే ముందు తమను సంప్రదించలేదని, ఇది ద్వైపాక్షిక ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిపై చర్చలు జరిపేందుకు భారత రాయబారిని పిలిపించినట్లు ప్రకటించింది. ప్రణరు వర్మ ఆదివారం విదేశాంగ శాఖ కార్యాలయానికి చేరుకని వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై భారత్‌ కూడా తగు చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌ డిప్యూటీ హైకమిషనర్‌ నురల్‌ ఇస్లామ్‌కు విదేశాంగ శాఖ నోటీసులు ఇచ్చింది.

గతేడాది ఆగస్ట్‌ 5న షేక్‌ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన అనంతరం హసీనా పార్టీ అవామీ లీగ్‌ సభ్యులు, బంగ్లాదేశ్‌ ప్రజలు సరిహద్దుల్లో నుండి భారత్‌ భూభాగంలోకి చొరబడుతున్నారు. దీంతో భారత ప్రభుత్వం సరిహద్దు భద్రతపై దృష్టి సారించింది. 2024 ఆగస్ట్‌ చివరలో మేఘాలయలో భారత్‌-బంగ్లాదేశ్‌ సరిహద్దులో అవామీ లీగ్‌ నేత ఇష్ఫాక్‌ అలీ ఖాన్‌ పన్నా మృతదేహాన్ని గుర్తించిన సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు ఆయనను వెంబడించి హత్య చేసి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.

➡️