- నేడు ట్రంప్తో భేటీ ?
జెరూసలేం : అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కావడానికి ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఆదివారం వాషింగ్టన్కు బయలుదేరి వెళ్ళారు. గాజాలో దాడుల విషయమై బైడెన్ ప్రభుత్వంతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వంతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. సోమవారం వారిద్దరి మధ్య సమావేశం జరగవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటగా భేటీ కానున్న విదేశీ నేత నెతన్యాహు కానున్నారు. గాజాలో జరిగిన దాడుల్లో తాము తీసుకున్న నిర్ణయాలతో మధ్య ప్రాచ్యంలో పరిస్థితులు ఇప్పటికే మారాయని నెతన్యాహు వాషింగ్టన్కు వెళ్లడానికి ముందు విమానాశ్రయంలో వ్యాఖ్యానించారు. తాము తీసుకున్న నిర్ణయాలు, తమ సైనికులు చూపించిన సాహసాలతో మ్యాప్ను తిరగరాశాం. కానీ ట్రంప్తో సన్నిహితంగా పనిచేస్తే ఈ మ్యాప్ను మరింత మెరుగ్గా విస్తరిస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. గాజాలో కాల్పుల విరమణ అమలు జరుగుతున్న వేళ, ఈ వారంలో రెండో దశ కాల్పుల విరమణ అమలుకై చర్చలు ప్రారంభమవుతాయని ఆశిస్తున్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.