ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదంపై నిరసనల వెల్లువ

  • కొలంబియా వర్శిటీలో గ్రంథాలయం ముట్టడి
  • పాలస్తీనాకు సంఘీభావంగా నినాదాలు హోరు
  • 75 మంది నిరసనకారుల అరెస్టు

న్యూయార్క్‌ : గాజాపై అమాయకులపై అమానవీయ దాడులు చేస్తున్న ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ, దానికి అన్ని రకాల అండదండలను అందిస్తున్న అమెరికా దుర్మార్గాన్ని తప్పుబడుతూ అమెరికాలో వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తమవుతూనేవున్నాయి. కొలంబియా యూనివర్శిటీ కేంపస్‌లో బుధవారం మధ్యాహ్నం పాలస్తీనాకు సంఘీభావం తెలియజేస్తూ వర్శిటీలోని గ్రంధాలయాన్ని ముట్టడించారు. వంద మంది పైగా ఆందోళనకారులు గ్రంధాలయంలోకి లోపలికి వెళ్లి ఇజ్రాయిల్‌ యుద్ధోన్మాదాన్ని నిరసించారు. ఇజ్రాయిల్‌కు, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాలతో నిరసనకారులకు, యూనివర్శిటీ భద్రతా అధికారులకు ఘర్షణ చోటు చేసుకోవడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. లైబ్రరీ ప్రవేశ ద్వారం వైపునకు ఆందోళనకారులను నెట్టేస్తుండగా, జరిగిన ఘర్షణల్లో ఇద్దరు అధికారులు గాయపడ్డారు. ‘పాలస్తీనాకు స్వేచ్ఛ కావాలి, నో కాప్స్‌, నో ఫాసిస్ట్‌ అమెరికా’ అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ దశలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు న్యూయార్క్‌ పోలీసులు కొలబియా యూనివర్శిటీ ప్రధాన కేంపస్‌లోకి ప్రవేశించారు. దాదాపు 75మందిని అరెస్టు చేశారు. పాలస్తీనా అనుకూల నిరసనలకు కొలంబియా యూనివర్శిటీ కేంద్రంగా వుంది. గతేడాది ఏప్రిల్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగి, పెద్ద సంఖ్యలో అరెస్టులు చోటు చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంత భారీ స్థాయిలో కొలంబియా వర్శిటీలో నిరసనలు జరగడం ఇదే. ముగ్గురు అంతర్జాతీయ విద్యార్ధులను అమెరికా హోం శాఖ నిర్బంధించడంపై ఈ వారం ప్రారంభంలో కొలంబియా యూనివర్శిటీ ఫ్యాకల్టీ, సిబ్బంది నిరసనలు తెలియచేశారు. నిర్బంధించిన వారందరినీ విడుదల చేసేంతవరకు ఈ నిరసనలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. తమ విద్యా కార్యకలాపాలకు ఆటంకాలు కలిగితే సహించేది లేదని యూనివర్శిటీ తాత్కాలిక అధ్యక్షులు క్లారే షిప్‌మన్‌ స్పష్టం చేశారు.

➡️