సిరియాలో తిరిగి ఇళ్లకు చేరుతున్న ప్రజలు

May 11,2025 00:34 #Syria

 స్వస్థలాలకు పది లక్షల మంది : ఐరాస
న్యూయార్క్‌ : నిత్యం బాంబు పేలుళ్లు, దాడులతో సతమతమౌతున్న సిరియాలో ప్రజలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వలస వెళ్లడం పరిపాటి. దీనికి తోడు బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు, యుద్ధ పరికరాల తయారీ కర్మాగారాలు (ఆర్డినెన్స), మైనింగ్‌ కోసం వినియోగించే పేలుడు సామగ్రి కారణంగా సిరియా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. దీంతో ప్రాణ రక్షణ కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం, పరిస్థితి సానుకూలంగా ఉన్నప్పుడు తిరిగి ఇళ్లకు చేరడం అక్కడ నిత్యకృతమైందని ఐక్యరాజ్యసమితికి చెందిన కోఆర్డినేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ అఫైర్స్‌ (ఒసిహెచ్‌ఎ – ఒచా) అధికారులు తెలిపారు. గత ఏడాది నవంబరు నుంచి 6.7 లక్షల మంది ఇలా స్వస్థలాలు వీడి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని చెప్పారు. అయితే మరో పది లక్షల మంది ఇతరులు తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారని పేర్కొన్నారు. పేలుళ్ల, వాటి దుష్ప్రాభావాల కారణంగా గతేడాది డిసెంబర్‌ 8 నుండి 367 మంది చనిపోయారని, మరో 542 మంది గాయపడ్డారని తెలిపారు. బాధితుల్లో మూడింట ఒక వంతు చిన్నారులే కావడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. రక్షిత ప్రాంతాలుగా భావించి తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న చోట్ల మానవతా సాయం అవసరం చాలా ఎక్కువ ఉందని ఐరాస అధికారులు తెలిపారు. ప్రధానంగా చిన్నారులకు పోషకాహరం, నీటి సరఫరా, జీవనోపాధి అకాశాల కల్పన అవసరమని తెలిపారు. దాదాపు 80 లక్షల మంది సాయం అందజేయాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రపంచ మానవాళి స్పందించాల్సివుందని తెలిపారు.

➡️