- ప్రదర్శనలపై పోలీసుల ఉక్కుపాదం
- పలువురుకి గాయాలు
ఖాట్మాండ్ : నేపాల్లో ఉపాధ్యాయ ఉద్యమం ఊపందుకుంది. పాఠశాల విద్యలో మార్పులు తీసుకురావాలని, వేతనాల పెంచాలని, ప్రోత్సహాకాలు ఇవ్వాలని కోరుతూ టీచర్లు భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం దేశ రాజధాని ఖాట్మాండ్లో ఉపాధ్యాయులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే అక్కడి ప్రభుత్వం తీవ్ర అణిచివేత చర్యలకు పాల్పడింది. ఉపాధ్యాయుల నిరసన ప్రదర్శనపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు ఉపాధ్యాయులకు గాయాలయ్యాయి. పాఠశాల విద్యలో ప్రస్తుత అవసరాలకు వీలుగా ప్రయోజనకర సంస్కరణలు తీసుకురావాలని, అందరికీ విద్య అందుబాటులో ఉండేలా పార్లమెంటులో చట్టం తీసుకురావాలని, అలాగే ఉపాధ్యాయులకు వేతనాలు, ప్రోత్సహకాలు పెంచాలని గత నెలరోజులుగా ఈ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. ఆదివారం వేలాది మంది ఆందోళనకారులు ఖాట్మాండ్లో నయాబనేశ్వర్లోని ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన భద్రతా వలయాన్ని ఛేదించేందుకు యత్నించారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్, వాటర్ కెనాన్లను ప్రయోగించారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.