టెక్సాస్ (అమెరికా) : అమెరికా టెక్సాస్లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థినిలు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గత శనివారం తెల్లవారుజామున జరిగింది. ఎన్.బోనీ బ్రే స్ట్రీ డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన దీప్తి వంగవోలు, ఆమె స్నేహితురాలు కలిసి గత శనివారం తెల్లవారుజామున కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా, వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వారిద్దరినీ ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. దీప్తి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్ర చికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. మరో విద్యార్థిని కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి. డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించడానికి ప్రజల సహాయం కోరుతూ అధికారులు ప్రకటన విడుదల చేశారు.
