చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ
బీజింగ్ : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల పట్ల చైనా ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకై అంతర్జాతీయ సమాజంతో కలిసి పనిచేసేందుకు చైనా సిద్ధంగా వుందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు. ఇరు దేశాల మద్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఇరు పక్షాలూ సంయమనం పాటించాలని చైనా కోరింది. ప్రస్తుత పరిణామాల పట్ల బీజింగ్ చాలా ఆందోళనగా వుందని లిన్ జియాన్ పేర్కొన్నారు. భారత్, పాక్లు రెండూ ఇరుగు పొరుగు దేశాలే కాదని, ఆ రెండూ కూడా చైనాకు పొరుగు దేశాలని ఆయన గుర్తు చేశారు. అన్ని రూపాల్లోని ఉగ్రవాదాన్ని తాము వ్యతిరేకిస్తామన్నారు. శాంతి, సుస్థిరతల విస్తృత ప్రయోజనాలకు అనుగుణంగా ఇరు పక్షాలు వ్యవహరించాలని కోరుతున్నామని చెప్పారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళితో సహా అంతర్జాతీయ చట్టాలను పాటించాలని కోరారు. ప్రశాంతంగా వుండాలని, సంయమనం పాటించాలని, పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే కార్యాచరణకు దిగకుండా వుండాలని లిన్ జియాన్ సూచించారు.
