బ్యాంకాక్ : స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలని థాయ్ లాండ్ నిర్ణయించింది. ఇందుకు వీలు కల్పించే చరిత్రాత్మక వివాహ సమానత్వ బిల్లుపై థాయ్ లాండ్ రాజు మహా వజ్రలాంగ్కర్ణ్ తాజాగా సంతకం చేశారు. దీంతో ఆగేయాసియాలో స్వలింగ సంబంధాలకు అధికారిక గుర్తింపు ఇచ్చిన తొలి దేశంగా థారులాండ్ నిలిచింది.
ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు …
2025 జనవరి 22 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం …. వివాహ చట్టంలో భార్య, భర్త వంటి పదాలకు బదులుగా ఇకపై వ్యక్తి, స్త్రీ, పురుషుడు అనే పదాలు వాడతారు. స్వలింగ జంటకు దత్తత, వారసత్వంతో పాటు పూర్తిస్థాయి ఆర్థిక, వైద్య, చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే స్వలింగ సంపర్కు (ఎల్జీబీటీక్యూ)లకు థారులాండ్లో మొదటి నుంచీ స్వేచ్ఛ ఎక్కువే. అయితే పూర్తిస్థాయి హక్కుల కోసం వాళ్లు 20 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.
జూన్లో సెనేట్ ఆమోదం ….
సంబంధిత బిల్లు జూన్లో సెనేట్ ఆమోదం పొందింది. రాజు ఆమోదంతో మంగళవారం చట్టరూపు దాల్చింది. ఇది చరిత్రాత్మకమంటూ ఎల్జీబీటీక్యూ ఉద్యమకారులు ప్రశంసించారు. ”చరిత్రలో చెరిగిపోని ఒక పేజీని లిఖించుకున్నాం. సమానత్వానికి, మానవ గౌరవానికి దక్కిన విజయమిది” అని ఎల్జీబీటిక్యూ హక్కుల కోసం దీర్ఘకాలంగా పని చేస్తున్న చుమాపోన్ అన్నారు. చట్టం అమల్లోకి రానున్న జనవరి 22న 1,000కి పైగా ఎల్జీబీటీక్యూ జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించే యోచన ఉన్నట్టు ఆమె తెలిపారు.
ఆసియాలో మూడో దేశం
తైవాన్, నేపాల్ తర్వాత ఆసియాలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించిన మూడో దేశంగా థాయ్ లాండ్ నిలిచింది. తైవాన్ 2019లో తొలిసారి ఈ చర్య తీసుకుంది. అనంతరం నేపాల్ సుప్రీంకోర్టు కూడా ఎల్జీబీటీక్యూ బంధాల చట్టబద్ధతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.