దావోస్: పనామా కాలువ తమదేనంటూ గత కొన్ని రోజులుగా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తీవ్రంగా స్పందించారు. ఈ కాలువను అమెరికా తమకేం బహుమతిగా ఇవ్వలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ములినో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”పనామా కాలువపై ట్రంప్ చెప్పిన ప్రతి మాటను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదంతా అవాస్తవం. ఆ కాలువ అమెరికా నుంచి మాకు రాయితీగానో.. బహుమతిగానో వచ్చింది కాదు. అది మాది. మాకు మాత్రమే సొంతం” అని తెలిపారు. అలాగే ఈ కాలువ విషయంలో చైనా ఎలాంటి జోక్యం చేసుకోవడం లేదని ఆయన తెలిపారు. ఇలాంటి ప్రకటనలతో పనామా ప్రజలను తప్పుదోవ పట్టించలేరని అన్నారు.
ట్రంప్ ఇటీవల పలు సందర్భాల్లో మాట్లాడుతూ పనామా కాలువ తమదేనని, తప్పకుండా వెనక్కి తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంది.
