వాషింగ్టన్ : ‘భారతీయ మార్కెట్లలో ప్రవేశించడానికి అసమంజసంగా ఉన్న అధిక సుంకాలు మాకు ప్రధాన సమస్యగా ఉన్నాయి. నిజానికి ఇది పెద్ద సమస్య’ అని ట్రంప్ విలేకరుల ప్రశ్నలకు బదులిచ్చారు. కాగా సుంకాల విషయంలో రెండు దేశాల మధ్య స్పష్టత రాకపోవడం గమనార్హం. ‘అనేక వస్తువులపై భారత్ 30, 40, 60….70 శాతం సుంకం కూడా విధిస్తోందని నేను చెప్పాల్సి ఉంది. కొన్నింటి విషయంలో సుంకాలు అంతకంటే ఎక్కువగా కూడా ఉన్నాయి. ఉదాహరణకు భారత్కు వెళుతున్న అమెరికా కార్లపై 70 శాతం సుంకం విధిస్తున్నారు. దీంతో వాటిని అక్కడ విక్రయించడం అసంభవం అవుతోంది.
వాణిజ్య లోటును పూడ్చుకుంటాం
చమురు, గ్యాస్ అమ్మకాలతో వాణిజ్య లోటును సులభంగా పూడ్చుకోగలమని ట్రంప్ అన్నారు. దీనిపై తాను, మోడీ ఓ ముఖ్యమైన ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన చెప్పారు. భారత్కు చమురు, గ్యాస్ సరఫరా చేసే ప్రపంచ దేశాల జాబితాలో అమెరికాది ప్రథమ స్థానం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘భారత్తో అమెరికా వాణిజ్య లోటు సుమారు 100 బిలియన్ డాలర్లకు చేరింది. గత నాలుగు సంవత్సరాల కాలంలో చోటుచేసుకున్న అసమానతలపై చర్చించి పరిష్కారాన్ని సాధించాలని నేను, మోడీ అంగీకారానికి వచ్చాం. వీటిపై ఇప్పటికే చర్చించి ఉండాల్సింది. కానీ అలా జరగలేదు’ అని ట్రంప్ వివరించారు.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు… అంటే 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని మోడీ వివరించారు. పరస్పర ప్రయోజనకర వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల బృందాలు త్వరలోనే అంగీకారానికి వస్తాయని చెప్పారు. ఇంధన భద్రత కోసం చమురు, గ్యాస్ వాణిజ్యంపై దృష్టి సారిస్తామని, ఇంధన మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు అణు ఇంధనాన్ని కూడా పెంచుతాయని అన్నారు. చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై సహకారాన్ని పెంచుకునే విషయంపై కూడా ట్రంప్తో చర్చించానని తెలిపారు. కాగా అణు సహకారంపై ట్రంప్ కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనివల్ల లక్షలాది మంది భారతీయులకు సురక్షి తమైన, స్వచ్ఛమైన విద్యుత్ అందుబాటు ధరలో లభిస్తుందని చెప్పారు.
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
ఉగ్రవాదంపై పోరు విషయంలో భారత్, అమెరికా దేశాలు కలిసికట్టుగా వ్యవహరిస్తాయని మోడీ చెప్పారు. సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాలంటే పటిష్ట చర్యలు అవసరమని తాము అభిప్రాయపడ్డామని అన్నారు. ముంబయి ఉగ్ర దాడి నిందితుడైన రాణా అప్పగింత అంశాన్ని ఆయన ప్రస్తావించారు. భారత్లో మారణకాండ సాగించిన వ్యక్తిని అప్పగిస్తున్నందుకు ట్రంప్కు కృతజ్ఞతలు తెలిపారు.
సాంకేతిక సహకారంపై…
వ్యూహాత్మకమైన, విశ్వసనీయ భాగస్వామిగా భారత రక్షణ సన్నద్ధతల్లో అమెరికా ముఖ్య పాత్ర పోషిస్తోందని మోడీ తెలిపారు. రాబోయే కాలంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉమ్మడిగా అభివృద్ధి చేసుకుంటామని, ఉత్పత్తి చేస్తామని, బదిలీ చేస్తామని చెప్పారు. 21వ శతాబ్దం సాంకేతికతోనే ముడిపడి ఉన్నదని అంటూ ఈ రంగంలో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ప్రజాస్వామిక విలువలపై విశ్వాసంతో, నూతన దిశగా ముందుకు సాగుతోందని అన్నారు. ఖనిజాలు, ఔషధాల విషయంలో బలమైన సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేసుకునే విషయంపై రెండు దేశాలు దృష్టి సారిస్తాయని మోడీ చెప్పారు. అంతరిక్ష సహకారం విషయంలో కూడా తమ మధ్య సన్నిహిత సహకారం నెలకొని ఉన్నదని అంటూ ఇస్రో, నాసా మధ్య పరస్పరం మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. భారతీయ ఉపగ్రహంపై రెండు దేశాలు త్వరలోనే అంతరిక్షంలోకి వెళతాయని చెప్పారు.
అంతర్జాతీయ అంశాలపై…
ఇండో-పసిఫిక్లో శాంతి, సుస్థిరత, సౌభాగ్యాన్ని పెంచేందుకు భారత్, అమెరికా కలసికట్టుగా కృషి చేస్తాయని మోడీ తెలిపారు. ఈ విషయంలో క్వాడ్ ప్రత్యేక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. భారత్-మధ్య ప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ను కూడా ఆయన ప్రస్తావిస్తూ ఈ ప్రాంతంలో ఆర్థిక కారిడార్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. చరిత్రలోనే అతి పెద్ద వాణిజ్య రహదారిని నిర్మించేందుకు సహకరిస్తామని తెలిపారు. ఈ రహదారి భారత్ నుండి ఇజ్రాయిల్, ఇటలీ, అమెరికా వరకూ ఉంటుందని చెబుతూ ఓడరేవులు, రైల్వేలు, సముద్ర గర్భంలోని కేబుల్స్ ద్వారా భాగస్వాములను కలుపుతామని వివరించారు. దీనిపై పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు.
చైనాతో సంబంధాలపై…
భారత్-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయని, అవి ఆగిపోవాల్సిన అవసరం ఉన్నదని మోడీ చెప్పారు. ఈ విషయంలో తన సాయం అవసరమైతే చేస్తానని అన్నారు. ‘మాకు చైనాతో మంచి సంబంధాలు ఉంటాయని అనుకుంటున్నాను. కోవిడ్ వచ్చే వరకూ దేశాధ్యక్షుడు క్సితో బాగానే సంబంధాలు నెరిపాను. అప్పటి వరకూ మేము బాగా సన్నిహితంగా గడిపాం. ప్రపంచంలో చైనా ఓ ముఖ్య పాత్ర పోషిస్తోందని నేను విశ్వసిస్తున్నాను. ఉక్రెయిన్, రష్యా యుద్ధ నివారణకు వారు కృషి చేసి ఉండవచ్చు. భారత్-చైనా సరిహద్దులో ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయని అనుకుంటున్నా. ఈ విషయంలో నేనేమైనా చేయగలిగేది ఉంటే చేస్తా. ఎందుకంటే ఘర్షణలు ఆగిపోవాలి. అవి చాలా కాలం నుండి కొనసాగుతున్నాయి. హింస జరుగుతోంది. చైనా, రష్యా, భారత్…మేమందరం కలిసి ముందుకు సాగగలం. అది చాలా ముఖ్యం’ అని మోడీ వివరించారు. అంతకుముందు ట్రంప్ ఓవల్ కార్యాలయంలో మోడీని కలిశారు. ఆయనతో కరచాలనం చేసి హత్తుకున్నారు. ప్రధాని మోడీని ‘దీర్ఘకాల స్నేహితుడి’గా అభివర్ణించారు.