- డొనాల్డ్ ట్రంప్ ప్రకటన
న్యూఢిల్లీ, వాషింగ్టన్ : భారత్- పాకిస్తాన్తో తమ వాణిజ్యాన్ని మరింత పెంచుకుంటామని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తమ జోక్యంతోనే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ సాధించామంటూ ఇదివరకే గొప్పలు చెప్పుకున్న ట్రంప్..అమెరికా అసలు లక్ష్యమేంటో ఆదివారం మరో ప్రకటన ద్వారా వెల్లడించారు. వెయ్యేళ్ల కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తాము మధ్యవర్తిత్వం వహిస్తామని చెప్పారు. అదే సమయంలో భారత్, పాక్ దేశాలతో వాణిజ్య అవకాశాలను గణనీయంగా పెంచుకుంటామని అసలు విషయాన్ని నిస్సిగ్గుగా అదే ప్రకటనలో వెల్లడించారు. మధ్యవర్తిత్వం పేరిట జోక్యాన్ని పెంచుకొని అనేక దేశాల మధ్య ఆరని చిచ్చులా ఘర్షణలు రాజేసిన అమెరికా ఇప్పుడు భారత్, పాక్ విషయంలోనూ అదే ప్రయత్నం చేస్తోందని పలువురు విమర్శకులు హెచ్చరించారు. ట్రంప్ తాజా పోస్టుపై భారత్ ప్రభుత్వం, అమెరికా విదేశాంగ శాఖ కూడా స్పందించలేదు. అయితే ‘వెయ్యి సంవత్సరాల’ భారత్-పాకిస్తాన్ వివాదం గురించి ట్రంప్ తప్పుగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి సహయం చేయమని ప్రధాని మోడీ అభ్యర్థించారని ట్రంప్ తెలిపారు. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో దీన్ని ఖండించింది.