న్యూఢిల్లీ : బ్రిటన్లో తీవ్రవాద గ్రూపుల నేతృత్వంలో వలస వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయి. సౌత్పోర్ట్, రోథర్హామ్, టామ్వర్త్, లివర్పూల్, మాంచెస్టర్, బ్రిస్టల్ వంటి ఇతర పట్టణాలకు ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న 400 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల సౌత్పోర్ట్లో కత్తిపోటుకు గురై ముగ్గురు యువతులు మృతి చెందారు. ఈ విషాదకరమైన హత్య తర్వాత..తప్పుడు సమాచారం వల్ల ఈ నిరసనలు జరిగాయి. హంతకుడు రువాండాకు చెందిన వ్యక్తి. ఇతను ముస్లింవలసదారుడని సోషల్మీడియాలో పుకార్లు వచ్చాయి. వీటివలనే నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పలు పట్టణాల్లో ఆశ్రయం పొందుతున్న హోటళ్లను తగలబెట్టారు. మైనార్టీ బ్రిటన్లు అక్రమదోపిడికి పాల్పడుతున్నారని నిరసనకారులు నినదించారు. ఈ నిరసనలను ప్రధానమంత్రి స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. నిరసనకారుల్ని పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్లో ఉంచుతారని.. వారికి చట్టపరమైన శిక్షలు పడతాయని ప్రధాని అన్నారు.
అనేక పట్టణాలకు ఈ నిరసనలు వ్యాపించాయి. దీంతో బ్రిటన్లో ఉన్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని లండన్లోని భారత హైకమిషన్ సూచించింది. స్థానిక వార్తలు, స్థానిక భద్రతా ఏజెన్సీలు జారీ చేసే సలహాలను పాటించాలని భారతీయులకు సూచించినట్లు భారత హైకమిషన్ ప్రకటన తెలిపింది.