లండన్ : ఉద్రిక్తతలను తగ్గించే దిశగా ముందుకు సాగేందుకు, చర్చల కోసం భారత్, పాకిస్తాన్లకు మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పిఒకెలోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. దాడుల తర్వాత బ్రిటన్ కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. జమ్ముకాశ్మీర్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని వ్యాపార, వాణిజ్య కార్యదర్శి జోనాథన్ రెనాల్డ్స్ పేర్కొన్నారు. తన కేబినెట్ సహచరుడు, విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ ఇరుదేశాలతో సంప్రదింపులు జరిపారని అన్నారు. ఇరుదేశాలకు స్నేహితులం, భాగస్వామ్యులం అనేది తమ సందేశమని, ఇరు దేశాలకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇరు దేశాలకు ప్రాంతీయ స్థిరత్వం, చర్చలు, ఉద్రిక్తతలను తగ్గించడంలో ఆసక్తి ఉందని, దానికి మద్దతుగా ఏవిధమైన సాయం అందించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
