ఇరాన్ స్పష్టీకరణ
దుబారు : అమెరికాతో దౌత్యానికి తాము కట్టుబడి వున్నామని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రోమ్లో గత శనివారం అమెరికాతో జరగాల్సిన నాల్గవ దఫా అణు చర్చలు వాయిదా పడిన నేపథ్యంలో ఇరాన్ ఈ విషయం వెల్లడించింది. చర్చలు, దౌత్య పంథాను కొనసాగించేందుకు నిబద్ధతతో వున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘె సోమవారం తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల్లో కూడా తాము పాల్గొని పూర్తి సన్నద్ధతను ప్రదర్శించామని చెప్పారు. చర్చల సమయానికి సంబంధించి కూడా తాము వెసులుబాటు ధోరణితోనే వ్యవహరిస్తున్నామని చెప్పారు. తదుపరి చర్చలు ఎప్పుడనే విషయమై మధ్యవర్తి ఒమన్ నుండి వివరాలు అందడం కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. చర్చలు జరుపుతున్న అమెరికా ప్రతినిధి బృందం వ్యవహార శైలి, వైఖరులు ఎలా వున్నాయనేదే తమకు అత్యంత కీలకమైన అంశమని బాఘె స్పష్టం చేశారు. అమెరికా అధికారులు చేసే పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల ఎలాంటి ఉపయోగం వుండదన్నారు. పైగా తమ ప్రాధమిక వైఖరులను సమర్ధించుకునే అంశంపై టెహరాన్ నిబద్ధతపై ఎలాంటి ప్రభావం చూపలేదని కూడా స్పష్టం చేశారు. యురేనియంను దేశీయంగా శుద్ధి చేసుకోవడంతో ఇరాన్ హక్కు అని దానిపై ఎలాంటి వాదనలకు తావు లేదని బాఘె పునరుద్ఘాటించారు. అణు కార్యక్రమానికి కావాల్సిన యురేనియంను శుద్ధి చేసుకోవడం కన్నా దిగుమతి చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఈ నెల 1న సూచించిన నేపథ్యంలో ఇరాన్ తన వైఖరి స్పష్టం చేసింది.
