తిరువనంతపురం : కేరళలోని మలప్పురం జిల్లాలో ఆలయ ఉత్సవాల్లో ప్రమాదం జరిగింది. ఓ ఏనుగు ఆగ్రహంతో ప్రజలపైకి దూసుకువెళ్లడంతో 17మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది.
బుధవారం ఉదయం తిరూర్లోని పుతియంగడిలో ఆలయ ఉత్సవం సందర్భంగా వందలాది మంది తరలివచ్చారు. అలంకరించిన ఐదు ఏనుగులను ఊరేగింపు కోసం తీసుకువచ్చారు. కొందరు వాటిని వీడియో తీస్తుండగా అకస్మాత్తుగా పాకుత్ శ్రీకుట్టన్ అనే ఏనుగు ఆగ్రహంతో జనాలపై దూసుకెళ్లింది. తొక్కిసలాట జరగడంతో పలువురికి గాయాలయ్యాయి. ఓ వ్యక్తి ఎత్తి గాలిలోకి విసిరిపారేసిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని, కోటక్కల్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఉన్నతాధికారులు తెలిపారు. రెండుగంటల అనంతరం ఎట్టకేలకు ఏనుగును మావటి అదుపులోకి తీసుకువచ్చారు.