అహ్మదాబాద్ : గుజరాత్లో దాదాపు 518 కిలోల కొకైన్ను పోలీసులు సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ రూ.5వేల కోట్లు ఉంటుందని అంచనా. ఢిల్లీ పోలీస్ ప్రత్యేక విభాగం, గుజరాత్ పోలీసులు ఆదివారం సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి దాదాపు 518 కిలోల కొకైన్ను ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 1న స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీలోని మహిపాల్పుర్లోని గోదాంలో సోదాలు జరిపి.. 562 కేజీల కొకైన్, 40కిలోల హైడ్రోపోనిక్ మారిజునాను సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నెల 10న ఢిల్లీలోని రమేశ్ నగర్ ప్రాంతంలోని ఓ షాప్లో దాడులు చేసి 208 కిలోల కొకైన్ను సీజ్ చేసినట్లు పోలీసు వర్గాలు ఇటీవల వెల్లడించాయి. కేవలం 15 రోజుల వ్యవధిలో దిల్లీ, గుజరాత్లలో దాదాపు రూ.13వేల కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
