డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అంటే నిరుద్యోగులకు రెండింతల కష్టాలు

A double engine government means double trouble for the unemployed

రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ : డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అంటే ‘నిరుద్యోగులకు రెండింతల కష్టాలు’ అని అర్థమని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఆదివారం తన సోషల్‌ మీడియాలో హిందీలో ఒక పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రతీ మూడో యువకుడు ‘నిరుద్యోగం అనే వ్యాధి’తో బాధపడుతున్నారని రాహుల్‌ తెలిపారు. ‘ఉత్తరప్రదేశ్‌లో 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్తీ చేయడం లేదు. కనీస విద్యార్హతతో భర్తీ చేసే పోస్టులకు కూడా గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు, పిహెచ్‌డి హోల్డర్లు లైన్‌లో నిలబడి ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘రిక్రూట్‌మెంట్‌ ప్రకటనలకోసం నిరుద్యోగులు వేచి చూడ్డం మొదటిది. రెండోది రిక్రూట్‌మెంట్‌ ప్రకటన వచ్చి పరీక్ష జరిగినా ఆ పేపర్‌ లీకవుతుంది. దీంతో ఆ పరీక్షల ఫలితాలు విడుదల కావు’ అని రాహుల్‌ వివరించారు. ఒకవేళ ఫలితం వచ్చినా సుదీర్ఘకాలం వేచి వుండాలని, జాయినింగ్‌లపై భరోసా కోసం కోర్టులకు తరుచూ వెళుతూ ఉండాలని రాహుల్‌ తెలిపారు. ఆర్మీ నుంచి రైల్వే వరకూ.. ఉపాధ్యాయ పోస్టుల నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ లక్షలాది మంది నిరుద్యోగులు వయోపరిమితి దాటిపోయారని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ విధానాలు మాత్రమే యువత కలలకు న్యాయం చేస్తాయని, యువకుల తపస్సును వృథా కానివ్వబోమని రాహుల్‌ తన పోస్టులో తెలిపారు.

➡️